రూ.81 లక్షల వార్షిక వేతనం | - | Sakshi
Sakshi News home page

రూ.81 లక్షల వార్షిక వేతనం

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

రూ.81 లక్షల వార్షిక వేతనం తెలంగాణ ఉద్యమకారుడు గుండెపోటుతో మృతి అధిక ఇంటి పన్నులు సవరించండి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా..

ప్లేస్‌మెంట్‌లో కేఎస్‌ యూనివర్సిటీ రికార్డు

మొయినాబాద్‌: 2025–26 విద్యాసంవత్సరం ప్లేస్‌మెంట్‌లో కేఎల్‌ డీమ్డ్‌ టూబీ యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. యూనివర్సిటీ బీటెక్‌ మెకానికల్‌ విద్యార్థి వెలగపూడి సాత్విక్‌ రూ.81 లక్షల వార్షిక వేతనంతో ప్లేస్‌మెంట్‌ పొందాడు. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ సంస్థ ఈ మొత్తం ఆఫర్‌ చేసింది. అదే విధంగా ఎంబీఏ విద్యార్థులు హరిని, సాత్విక్‌ ఫిన్‌లాండ్‌కు చెందిన సంస్థలో రూ.35 లక్షలు, రూ.33 లక్షల వేతనాలతో ఉద్యోగ అవకాశాలు పొందారు. ఉత్తమ ప్లేస్‌మెంట్‌ సాధించిన విద్యార్థులను అజీజ్‌నగర్‌లోని కేఎల్‌ యూనివర్సిటీలో చాన్సలర్‌ కోనేరు సత్యనారాయణ, వైస్‌ చాన్సలర్‌ జి.పార్థసారధివర్మ, అధ్యాపకులు అభినందించారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కర్నె అరవింద్‌ (35) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వికారాబాద్‌లో జరిగిన బావమరిది వివాహ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఆయన వివాహం అయిన వెంటనే పెళ్లి పందిరిలోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. సాయంత్రం ఇబ్రహీంపట్నంలో అంత్యక్రియలు నిర్వహించారు. అరవింద్‌ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ సోదరుడి కుమారుడు. తెలంగాణ ఉద్యమంతో పాటు, బీఆర్‌ఎస్‌ పార్టీలో చురుకై న పాత్ర పోషించారు. ఇటీవల మీడియా స్పోక్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు. అరవింద్‌ మృతికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, క్యామ మల్లేష్‌, కర్నె ప్రభాకర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీ ల నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు నివాళి అర్పించారు.

మీర్‌పేట: మీర్‌పేట, జిల్లెలగూడ ప్రాంతాల్లో అధికంగా వసూలు చేస్తున్న ఇంటి పన్నులను సవరించాలని మాజీ ఉప సర్పంచ్‌ మేకల రవీందర్‌రెడ్డి, పలు కాలనీల ప్రతినిధులు ఆదివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబుకు విన్నవించారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల కంటే మీర్‌పేట, జిల్లెలగూడలోనే కొన్నేళ్లుగా అధికంగా ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. పక్కనే ఉన్న బడంగ్‌పేటతో పోలీస్తే చాలా వ్యత్యాసం ఉందని మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి ఇంటి పన్నులు సవరించేలా చర్యలు చేపట్టాలని బడంగ్‌పేట సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ను ఫోన్‌ ద్వారా ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో కాలనీల ప్రతినిధులు దుర్గాదాస్‌గౌడ్‌, అశోక్‌రెడ్డి, నందు, బి.కృష్ణారెడ్డి, జి.సుకుమార్‌, ఎస్‌ఎల్‌కే శ్రీనివాస్‌ ఉన్నారు.

మహేశ్వరం: పెళ్లికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన మల్లేపల్లి ప్రభుదాస్‌ (55) ఆర్‌ఎంపీ వైద్యుడు. ఆదివారం సాయంత్రం దేవునిపడకల్‌ గ్రామంలో జరిగే వివాహానికి భార్య యాదమ్మతో కలిసి స్కూటీపై వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. గేటు వద్దకు రాగానే అదే సమయంలో హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభుదాసు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, భార్య యాదమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు యాదమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement