సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనైతిక చర్యలకు పాల్పడుతున్న ఆస్పత్రులపై జిల్లా వైద్యారోగ్యశాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇప్పటికే కర్మన్ఘాట్లోని బీఆర్ ఆస్పత్రి, మోకిలలోని ఓ ప్రైవేటు ఫిజియో థెరపీ సెంటర్, గండిపేటలోని స్టార్హెల్త్ డయాగ్నోస్టిక్ సెంటర్, శంషాబాద్లోని బ్లూటస్ ఆస్పత్రి, ఆమనగల్లోని శ్రీసాయి ఆస్పత్రి, హస్తినాపురంలోని లీలాద్రి ఆస్పత్రులను సీజ్ చేసింది. తాజాగా తుక్కుగూడ కేంద్రంగా నిర్వహిస్తున్న గ్రేస్ ఆస్పత్రికి సీజింగ్ నోటీసులు, మరో 15 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు ఉలిక్కిపడుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది కొత్తపేటలోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీరాకెట్ సహా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యహారంతో అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ జిల్లాలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లాలో 45 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో నలుగురు మెడికల్ ఆఫీసర్లను నియమించింది. వారంలో రెండు రోజులు(మంగళ, గురువారాల్లో) 50 ఆస్పత్రుల చొప్పున తనిఖీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆయా బృందాలు జిల్లాలో 700కి పైగా ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టింది. కన్సల్టెన్సీ, చికిత్సలకు సంబంధించిన ఫీజుల ఛార్టులు సహా వైద్యుడి విద్యార్హత ధ్రువీకరణ పత్రం, మున్సిపాలిటీ నుంచి పొందిన బిల్డింగ్ పర్మిషన్లు, ఫైర్సేఫ్టీ సర్టిఫికెట్, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి పొందిన అనుమతి పత్రాలను పరిశీలిస్తోంది. ఇందులో ఏ ఒక్కటి లేకున్నా.. ఆయా ఆస్పత్రులను సీజ్ చేస్తోంది.
రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ కావు..
ఫైర్సేఫ్టీ ఉండదు
జిల్లాలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్ హోమ్స్ సహా ఫెర్టిలిటీ సెంటర్లు, డెంటల్ క్లినిక్లు, కన్ను, చెవి, ముక్కు(ఈఎన్టీ), ఆప్తమాలజీ, స్కిన్కేర్ క్లినిక్లు 3,136 వరకు ఉన్నాయి. వీటితో పాటు మరో 834 డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఇవి కాకుండా బస్తీల్లో, మారుమూల మండల కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లు ఉన్నాయి. అక్రమ నిర్మాణాల్లోనే మెజార్టీ ఆస్పత్రులు, క్లినిక్లు కొనసాగుతున్నాయి. కనీస భద్రత, మౌలిక సదుపాయాలు లేని నిర్మాణాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఆయుర్వేద, యునానీ వైద్యులు.. అల్లోపతి వైద్యులుగా, పన్నెండు కూడా పాస్కానీ వాళ్లు.. ఎంబీబీఎస్ వైద్యులుగా చలామణి అవుతున్నారు. ప్రిస్క్రిప్షన్లు రాయడంతో పాటు ఏకంగా సర్జరీలే చేసేస్తున్నారు. మరికొందరు అవయవ మార్పిడి చికిత్సలు చేస్తూ బాధితుల మృత్యువాతకు కారణమవుతున్నారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని ఫెర్టిలిటీ, సరోగసి, స్పెర్మ్ స్టోరేజీ కేంద్రాల పేరుతో అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. సంపాదనే లక్ష్యంగా కొన్ని డయాగ్నోస్టిక్స్ కడుపులో ఉన్నది ఆడో, మగో ముందే చెప్పేస్తున్నాయి. అబార్షన్లను ప్రోత్సహిస్తూ పరోక్షంగా బ్రూణహత్యలకు కారణమవుతున్నారు. ఇలాంటి అనైతిక ఆస్పత్రులు, నకిలీ వైద్యులపై జిల్లా వైద్యారోగ్యశాఖ కొరడా ఝళిపిస్తున్నా..అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు.
ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీకి 45 ప్రత్యేక బృందాలు
వారంలో రెండు రోజులు.. 50 ఆస్పత్రుల పరిశీలన
ఇప్పటికే ఏడు ఆస్పత్రులు సీజ్
మరో 15 హాస్పిటల్స్కు షోకాజ్ నోటీసులు జారీ!
ఆస్పత్రి రిజిస్ట్రేషన్, ఫైర్ సేఫ్టీ, పీసీబీ, బిల్డింగ్ పర్మిషన్, ఓసీ సహా మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన


