సాక్షి రంగారెడ్డి జిల్లా: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్తో కలిసి జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీల వారీగా పారిశుద్ధ్య పనులు, విద్యుత్కు సంబంధించిన మరమ్మతులు, భవనాల మరమ్మతులు, పెయింటింగ్ వంటి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యాలయాల పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్ పూర్తి చేయాలని, ఏ ఒక్క శాఖలో ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో ఉండకూడదన్నారు. మంజూరైన పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వాటి పరిసరాలు సైతం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని తెలిపారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైళ్లు క్లియర్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమకు నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున ఏ ఒక్కచోట కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని, పైపు లీకేజులు లేకుండా చూడాలని, ఎక్కడా నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట బోరు మోటార్లు, హ్యాండ్ పంపులు, ఇతర తాగునీటి వనరులకు మరమ్మతు పనులు జరిపించాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో, సమష్టిగా పని చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్ఓ సంగీత, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీపీఓ సురేశ్ మోహన్, సీపీఓ సౌమ్య, డీఆర్డీఏ పీడీ శ్రీలత, వ్యవసాయాధికారి ఉష, పౌరసరఫరాల అధికారి వనజాత, మేనేజర్ హరీష్, మిషన్ భగీరథ, ఆర్అండ్ బీ, సంక్షేమ శాఖ అధికారులు రామరావు, నవీన్ కుమార్ రెడ్డి, కేశురాం, కె.రామేశ్వరి దేవి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ నారాయణరెడ్డి


