ఇబ్రహీంపట్నం: పేదలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే పోరాటాలు తప్పవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వరకు చేపట్టిన పాదయాత్రను సోమవారం ఇబ్రహీపట్నంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయా ప్రభుత్వాలు తుంగలో తొక్కాయన్నారు. రామోజీ ఫిలింసిటీలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారికి స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించి, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. యాచారం, మంచాల మండలాల్లో పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వాలు లాక్కొనే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు సాగుచేసుకుంటున్న రావిరాల గ్రామ పరిధిలోని భూములకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇవ్వాలని, ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పాదయాత్ర ఇబ్రహీంపట్నం నుంచి శేరిగూడ, మంగళ్పల్లి, కొంగరకలాన్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రలో సామేల్, రాంచందర్, ఎ.నర్సింహ, కె. జగన్, కె.భాస్కర్, ఎం.చంద్రమోహన్, డి.జగదీశ్, జంగయ్య, ఎ. నర్సింహ, ఎల్లేష్, శేఖర్, శ్యామ్సుందర్, సీహెచ్ జంగయ్య, కె. నర్సింరెడ్డి, కిషన్, బుగ్గరాములు తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో సర్కార్ విఫలం
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు భూపాల్ విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. మంగళ్పల్లి మీదుగా కొంగరకలాన్కు చేరుకున్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సామేలు, రాంచందర్, డి.జగదీష్, చంద్రమోహన్, కందుకూరి జగన్, నర్సింహ, మండల కార్యదర్శులు జంగయ్య, అలంపల్లి నర్సింహ, బుగ్గరాములు, దయ్యాల కిషన్, పి.జగన్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, అంజయ్య, శ్యామ్సుందర్, నర్సిరెడ్డి, బాల్రాజ్, నర్సింహ, శేఖర్, ఎల్లేష తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ


