● మెరుగైన పరిహారం ఇవ్వాలని గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూబాధితుల డిమాండ్
● ఆరో రోజుకు చేరిన గిరిజన రైతుల దీక్ష
యాచారం: గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో భూములు కోల్పోతున్న తమకు మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతులు చేపట్టిన రిలే దీక్ష కొనసాగుతోంది. మండలంలోని కుర్మిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలో ఏర్పాటు చేయ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్(330 అడుగుల) రోడ్డు నిర్మాణ పనులకు అడ్డంకింగా మారింది. మర్లకుంట, మంగళిగడ్డ, పోతుబండ తండాలకు చెందిన 90 మంది గిరిజన రైతులకు పలు సర్వే నంబర్లల్లో 200 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులో 60 మంది రైతులకు చెందిన 35 ఎకరాల పట్టా భూమి గ్రీన్ ఫీల్డ్ రోడ్డులో పోతుంది. మూడు తండాలకు చెందిన రైతులకు చెందిన 200 ఎకరాల పట్టా భూమి సేకరణలో రైతుల అంగీకారం లేకుండానే అధికారులు ఫార్మాసిటీకి సేకరించారు. పరిహారం చెల్లింపుపై స్వష్టత లేదు. గతంలోనే 200 ఎకరాల పట్టా భూమికి సంబంధించి పరిహారాన్ని ఆథారిటీలో జమ చేసిన అధికారులు, రైతుల పేర్లపై ఉన్న భూరికార్డులను టీజీఐఐసీ పేరు మీద మార్చేశారు. టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన భూరికార్డులను తమ పేర్లపై మార్చాలని ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకుండా పోతుంది. పైగా ఆ భూములు మీవి కానే కావు.. పరిహారం ఆథారిటీలో జమ చేశాం, రికార్డులు టీజీఐఐసీ పేరు మీద ఉన్నాయని అధికారులు అంటున్నారు.
పనుల మొదలుతో దీక్ష
గత వారం కింద అధికార యంత్రాంగం కుర్మిద్ద గ్రామ రెవెన్యూ పరిధిలోని పట్టా భూముల్లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం యంత్రాలతో పనులు మొదలు పెట్టారు. దీంతో రైతులు కనీసం సమాచారం లేకుండానే, పరిహారం చెల్లింపుపై స్వష్టత లేకుండానే పనులు ఎలా ప్రారంభిస్తారని గిరిజన రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో రిలే దీక్షలకు దిగారు. స్థానిక గిరిజన రైతులకు మద్దతుగా రాష్ట్ర గిరిజన సంఘం సేవాలాల్ సంఘాల నేతలు మద్దతు ప్రకటిస్తున్నారు. గిరిజనుల దీక్ష ఆదివారం ఆరో రోజుకు చేరింది. న్యాయమైన పరిహారం చెల్లిస్తే గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు కావాల్సిన భూమి ఇస్తామని, కానీ టీజీఐఐసీ పేరు మీద మార్చేసిన మిగితా 175 ఎకరాలకు పైగా పట్టా భూమి రికార్డులను మా పేర్లపై మార్చాలని రైతులు ఆందోళనకు దిగారు. కుర్మిద్ద గ్రామంలో ఓ వర్గానికి చెందిన ఒక ఎకరా భూమిని కూడా తీసుకోలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన అసైన్డ్ భూమితో పాటు పట్టా భూములు తీసుకుంటే ఎట్లా బతికేది అని రైతులు పేర్కొంటున్నారు. గిరిజనుల దీక్షతో ఏం చేయాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు.


