మొయినాబాద్: ‘పరాభవం అంటే సంస్కృతంలో అవమానం, చెడు ప్రభావం అనే అనుభూతి ఉంది. అది భగవంతుడికి వ్యతిరేకంగా ఉండే శక్తులకే పరాభవం. ధర్మ ఆచరణ చేసేవారికి పరాభవమే ఒక ఆశీర్వాదం’ అని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ పేర్కొన్నా. ఉగాది సందర్భంగా గురువారం చిలుకూరు బాలాజీ దేవాలయంలో పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ నింద, దైవ ధూషణ చేసేవారికి పరాభవం ఉంటుందని తెలి పారు. ఈ సంవత్సరం గురువారం రోజు పుట్టడంతో గురువుగారు రాజుగా ఉంటారని.. నవనాయకుల్లో ఏడుగురు శుభులు, ఇద్దరు పాపులు ఉంటారన్నారు. ఏడు శుభాలు, రెండు అశుభాలు ఉంటాయన్నారు. 70 శాతానికి పైగా శుభమే ఉంటుందన్నారు. ఈసారి విశేషమైన వర్షాలు ఉంటాయని.. సువృష్టి ఉంటుందని.. అనావృష్టి ఉండదని.. కొన్ని ప్రదేశాల్లో కుంభవృష్టి ఉంటుందని చెప్పారు. జల ప్రళయాలకు సంబంధంలేదని.. కరువు కాటకాలు ఉండవు.. అతివృష్టి ఉండదన్నా రు. ఈ సంవత్సరం దాన ధర్మాలు ఎక్కువగా చేయాలని.. భగవంతునిపైన చింతన పెంచే విధంగా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని.. విద్యాదానం చేయాలని సూచించారు. సీ్త్ర జాతి అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. పంచాంగ పఠనం చేసే ముందు రంగరాజన్ భావోద్వేగానికి గురయ్యారు. గత నెల 27న తన తండ్రి సౌందరరాజన్ మరణించారని, 25 ఏళ్లుగా పంచాంగ పఠనం చేస్తున్న తాను మొదటిసారి తండ్రి పర్యవేక్షణ లేకుండా పఠనం చేస్తున్నాని ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ
కలియుగ దైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల పత్రికను గురువారం ఆవిష్కరించారు. పంచాంగ పఠనం అనంతరం స్వామివారి పాదాల వద్ద బ్రహ్మోత్సవాల పత్రికను ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దలు, అర్చకుల చేతులమీదుగా పత్రికను ఆవిష్కరించి కావలి వంశానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుండు గోపాల్కు మొదటి పత్రికను అందజేశారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 3 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి, అర్చకులు పాల్గొన్నారు.
చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్


