ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో డీఆర్ఓ సంగీతతో కలిసి ప్రజల వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్జీదారులకు ఖచ్చితమైన సమాధానం ఇవ్వడంతో పాటు పరిష్కారం చూపాలన్నారు. అప్లికేషన్లను పెండింగ్లో పెట్టకూడదని సూచించారు. ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయని వాటిని వెంటనే సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేశామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


