ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
మహేశ్వరం: రోడ్డు నియమాలను వాహనదారులు పాటించాలని మహేశ్వరం ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని మహేశ్వరం గేటు శ్రీశైలం జాతీయ రహదారిపైన వాహనాదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో వెళ్లే వారు సీటు బెల్టు కచ్చితంగా ధరించాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ను ఫాలో అవుతూ వాహనాలను నడపాలన్నారు. అతి వేగం ప్రమాదకరమన్నారు. మద్యం, మత్తు పదార్థాలు తాగి వాహనాలు నడపడం నేరమని, అతిక్రమిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపొద్దన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, వాహనదారులు, స్థానికులు పాల్గొన్నారు.


