ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా సహాయ ఎన్నికల అధికారి శంకర్
ఆమనగల్లు: మున్సిపాలిటీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సహాయ ఎన్నికల అధికారి, ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ శంకర్నాయక్ అన్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కోసం 150 మంది సిబ్బంది, ఏడుగురు చొప్పున ఆర్ఓలు, ఏఆర్ఓలను నియమించి రెండు దఫాల శిక్షణ ఇచ్చామన్నారు. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్లో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఓటర్లు ఇబ్బందులు పడ కుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దివ్యాంగులు, వృద్ధులకు వీల్చైర్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని చెప్పారు. ప్రతీ ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
పొలం పనులు చేస్తూ
కూలీ మృతి
కేశంపేట: వ్యవసాయ పనులు చేసేందుకు కూలి పనులకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం... కేశంపేట గ్రామంలో మఠం శేఖర్ వ్యవసాయ పొలంలో కూలి పనులకు ఆదివారం అదే గ్రామానికి చెందిన ఢిల్లీ శేఖర్ (45) వెళ్లాడు. మొక్కజొన్న పంటకు నీళ్లు పెడుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. మృతుడి అన్న సత్యనారాయణ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.


