ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ మృతి
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం వెంకట్రావుపేట చౌరస్తా సమీపంలో మంగళవారం సాయంత్రం ట్రాక్టర్–ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. తలకొండపల్లి ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావుపేట గ్రామం నుంచి పోలె రాములు(48) ట్రాక్టర్ ఇంజన్ను నడుపుకొంటూ స్థానిక చౌరస్తా వైపునకు వస్తున్నాడు. మార్గమధ్యలో పద్మగార్డెన్స్ సమీపంలో ఎదురుగా చుక్కాపూర్ గ్రామం నుంచి వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొంది. దీంతో ట్రాక్టర్ రోడ్డు సైడ్కు వెళ్లి గుంతలో పడింది. దాని కింద ట్రాక్టర్ డ్రైవర్ రాములు చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్ వీరేశ్ తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం వెల్దండలోని ఓ హాస్పిటల్కు తరలించారు. మృతుడికి భార్య పద్మమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.
వ్యభిచార గృహంపై దాడులు
ఐదుగురు విదేశీయుల అరెస్ట్
మియాపూర్: గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..న్యూ హాఫీజ్పేట సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయగా విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశంలోని మొన్రోవియా సిటీకి చెందిన డేరియస్ (28) అనే యువకుడు విద్యాభ్యాసం నిమిత్తం నగరానికి వచ్చి సుభాష్ చంద్రబోస్నగర్లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్లో విద్యనభ్యసిస్తున్నాడు. ఇతను కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. డేరియస్తో పాటు నలుగురు విదేశీ మహిళలను అరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారి వద్ద రూ.4 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా డేరియస్ను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
అల్వాల్: భార్యా భర్తల మధ్య గొడవలతో విసుగు చెంది..భర్త ఆత్మహత్య చేసుకున్న సంఽఘటన అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాప్రాల్లో నివసించే సుధీర్ (28) మేసీ్త్ర పనిచేస్తుంటాడు. సుధీర్ భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నారు. వీరిది ప్రేమ వివాహం. గత మూడు నెలల నుండి భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా సుధీర్ మంగళవారం అల్వాల్ వీబీఆర్ గార్డెన్ వద్ద అతని అక్క నివాసానికి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
డేటింగ్ యాప్లో మహిళను మోసగించిన ఎయిర్లైన్స్ ఉద్యోగి
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో నివాసముంటన్న ఓ ఎయిర్లైన్స్ ఉద్యోగి డేటింగ్ యాప్లో మహిళను మోసగించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న వసంత్ (32) అనే వ్యక్తి డేటింగ్ యాప్లో మహిళతో తాను వైద్యుడినని పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన బ్యాంకు ఖాతా ప్రీజ్లో ఉందని, కొంత నగదు కావాలని మహిళలకు చెప్పడంతో ఆమె రూ.29 వేలు అతడి బ్యాంకు ఖాతాలో వేసింది. కొన్ని రోజుల తర్వాత తన తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తనకు మరో 40 వేలు ఖాతాలో వేసే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సదరు మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆర్జీఐఏ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాండూరు ఎంపీడీఓకు బషీరాబాద్ బాధ్యతలు
తాండూరు రూరల్: తాండూరు ఎంపీడీఓ విశ్వప్రసాద్కు బషీరాబాద్ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఎంపీడీఓగా పని చేసిన విజయ్ కుమార్ హైదరాబాద్ హౌ సింగ్ విభాగానికి బదిలీపై వెళ్లారు. ఈ మేరకు మంగళవారం విశ్వప్రసాద్ బషీరాబాద్ ఎంపీడీ ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.


