మోపెడ్ దొంగలకు రిమాండ్
అంబర్పేట: ఒకే రకం వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 19 వాహనాలను స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపారు. మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ హరీష్కుమార్, అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్ వివరాలు వెల్లడించారు. గత నెల 10న అంబర్పేట ప్రేమ్నగర్లో నివసించే రాజశేఖర్ టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం చోరీకి గురికావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ కెమెరాల ఆధారంగా లాల్దర్వాజ ఛత్రినాకకు చెందిన సాకత్వారి శ్రావణ్, బీబీనగర్కు చెందిన కలీయ రాజు, సాకత్ ముకిందర్ చోరీ చేసినట్లు గుర్తించారు. సోమవారం అంబర్పేటలో వాహనాలు తనిఖీ చేయగా అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు స్నేహితులుగా ఉంటూ కేవలం టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలను మాత్రమే చోరీ చేస్తున్నట్లు తేలింది. వీరు ముగ్గురు వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో 19 టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనాలను చోరీ చేసినట్లు తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకుని యాజమానులకు అప్పగించనున్నట్లు డీసీపీ తెలిపారు. ముగ్గురి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
19 టీవీఎస్ ఎక్స్ ఎల్ వాహనాలు స్వాధీనం


