
గోవులను రక్షించుకుందాం
ఇబ్రహీంపట్నం: గో సంతతిని కాపాడుకోవాలని, గోవులను రక్షించుకుంటేనే ప్రకృతి పరంగా జీవరాసులన్నింటికీ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ ప్రాంత గో సేవా ప్రముఖ్ వెంకట నివాస్జీ అన్నారు. జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలను మంగళవారం ఇబ్రహీంపట్నంలోని త్రిశక్తి అలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గో సంతతి పెరిగితేనే భూసారం పెరుగుతుందని తెలిపారు. గోవుల పాల ఉత్పత్తులతోపాటు గో ఆధారిత వ్యవసాయం చేస్తే మనమంతా ఉండగలుగుతామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా, 80 కోట్లకు పైగా పశు సంతతి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం 20 కోట్ల పశువులు మాత్రమే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశుసంతతిని పెంపొందించుకునేందుకు, వాటిని రక్షించుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో విభాగ్, జిల్లా గో సేవా ప్రముఖులు వేణుగోపాల్, రచమళ్ల అబ్బయ్య, సుధాకర్రెడ్డి, బుగ్గవరపు రమేష్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: సీజేఐ గవాయ్పై దాడి అంటే రాజ్యాంగం, పార్లమెంట్, దేశం మొత్తంపై జరిగిన దాడిగా చూడాల్సిందేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీజేఐపై దాడిని నిరసిస్తూ కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సామెల్ అధ్యక్షతన మంగళవారం ఇబ్రహీంపట్నంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సామెల్తోపాటు కార్యదర్శి ప్రకాశ్ కారత్, బీఎస్పీ నాయకుడు కొండ్రు రఘుపతి, తెలంగాణ ఉద్యమకారులు బోసుపల్లి వీరేష్కుమార్, రాములు, మారయ్య, పూస ల సంఘం రాష్ట్ర నాయకుడు పురుషోత్తం, రజక సంఘం నాయకుడు ముదిగొండ అజయ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి చేసిన.. దాని వెనుకల ఉన్న నిందితులను కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. సమావేశంలో వెంకటేశ్, బండి సత్తయ్య, కాలె గణేశ్, కాళ్ల జంగయ్య, ఎం. రాజు, కరుణాకర్ పాల్గొన్నారు.
యాచారం: మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 19, 68, 127లోని అసైన్డ్, ప్రభుత్వ భూములపై గ్రామ రైతులతో బుధవారం సమావేశం ఉంటుందని తహసీల్దార్ అయ్యప్ప తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటల కు జరిగే సమావేశానికి ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్రెడ్డి హాజరవుతారని చెప్పారు. నోటిఫికేషన్ వేసిన 820 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించి ఏం చేయాలనే విషయమై చర్చించడం జరుగుతుందని ఆయన వివరించారు.
మహేశ్వరం: పెండింగ్ కమీషన్ డబ్బులు విడుదల చేయాలని మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎంపీ రఘునందన్రావును రేషన్ డీలర్ల సంఘం నాయకులు కలిశారు. కమీషన్ సకాలంలో రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. రాష్ట్రం, కేంద్రం నుంచి వచ్చే పెండింగ్ కమీషన్లను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో విడుదలయ్యే విధంగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. మంత్రులు, ఎంపీని కలిసిన వారిలో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.లక్ష్మీనారాయణ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భానుగౌడ్, ఆర్గనైజింగ్ సేక్రటరీగా విజయ్ సూర్య తదితరులు ఉన్నారు.

గోవులను రక్షించుకుందాం

గోవులను రక్షించుకుందాం