
కాపురానికి రావడం లేదని..
రెండో భార్యను హత్య చేసిన భర్త
చేవెళ్ల: కాపురానికి రావడం లేదనే కక్షతో భార్యను కడతేర్చాడో భర్త. మాట్లాడుకునేందుకు తీసుకెళ్లి బండ రాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని ఆలూరు అనుబంధ గ్రామమైన వెంకన్నగూడకు చెందిన వానరాసి జంగయ్య బతుకుదెరువు నిమిత్తం రాంచంద్రాపురంలో ఉంటూ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలున్నారు. ప్రస్తుతం రాంచంద్రాపురంలో మొదటి భార్యతో కలిసి ఉంటున్నాడు. రెండో భార్య రజిత(30) పటాన్చెరులో ఇళ్లలో పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. గత రెండేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు నెలకొనడంతో రజిత దూరంగా ఉంటోంది. కాపురానికి రావాలని ఎన్నిసార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. ఎట్టకేలకు తన తల్లి వద్ద మాట్లాడుకుందామని చెప్పిన జంగయ్య ఆమెను తీసుకుని గత సోమవారం రాత్రి వెంకన్నగూడకు వచ్చాడు. మరుసటి రోజు మంగళవారం గ్రామస్తుల సమక్షంలో పంచాయితీ పెట్టినా భర్తతో ఉండేందుకు రజిత అంగీకరించలేదు. దీంతో కక్ష పెంచుకున్న జంగయ్య అదేరోజు రాత్రి రజితను గ్రామ సమీపంలోని ఓ వెంచర్లోకి తీసుకెళ్లి చున్నీ మెడకు బిగింగి, తలపై బండరాయితో మోది చంపాడు. అనంతరం నేరుగా వెళ్లి పీఎస్లో లొంగిపోయాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు వివరాలు సేకరించి, కేసు నమో దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా హత్యలో మొదటి భార్య ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.