
ట్రిపుల్ఆర్ మంటలు
తరచూ రోడ్డెక్కి నిరసనలు మా భూముల జోలికి రావొద్దని హెచ్చరిక బలవంతంగా లాక్కుంటే చావే శరణ్యమంటున్న బాధితులు ధర్నాకు సిద్ధమవుతున్న పూడూరు, నవాబుపేట మండలాల రైతుల అరెస్ట్
అలైన్మెంట్ మార్చడంతో అన్నదాతల పోరుబాట
పూడూరు: ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చడంపై బాధిత రైతులు పోరుబాట పట్టారు. మా భూములు తీసుకుంటే వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవంతంగా లాక్కుంటే చావే శరణ్యమని అంటున్నారు. పూడూరు మండల పరిధిలోని తుర్క ఎన్కేపల్లి, కంకల్, నిజాంపేట్ మేడిపల్లి, మంచన్పల్లి, గట్టుపల్లి, సిరిగాయపల్లి, కెరవెళ్లి, రాకంచర్ల, పెద్ద ఉమ్మెంతాల్, పూడూరు, గొంగుపల్లి, ఎన్కేపల్లి తదితర గ్రామాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వేయనున్నారు. దీంతో రైతులు ఆందోళ న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పెద్దల కోసం మూడు సార్లు అలైన్మెంట్ మార్చి పేదల కడుపుకొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ ధర్నాలు చేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయా లని పలువురు డిమాండ్ చేశారు. తామంతా పొలాలను నమ్ముకొనే జీవనం సాగిస్తున్నామని, బలవంతంగా భూములు లాక్కుంటే గ్రామాలు వదిలి వలస వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఎంతో కష్టపడి భూములు కొనుగోలు చేశామని.. ఏడాదికి మూడు పంటలు తీస్తున్నామని, ఇలాంటి పొలాల ను అభివృద్ధి పేరిట తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని విరమించుకో వాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. సోమవారం నగరంలోని హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద ధర్నాకు సిద్ధమవుతున్న సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పూడూరు రైతులు తాజొద్దీన్, నర్సింహారెడ్డి, సాయన్న, అనీల్, జంగయ్యను అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్స్టేషన్కు తరలించారు.
ఏ మండలంలో ఎన్ని ఎకరాలంటే..
జిల్లాలోని మోమిన్పేట్ మండలంలో రెండు గ్రా మాల్లో 300 ఎకరాలు, నవాబుపేట మండలంలో 400 ఎకరాలు, పూడూరు మండలంలో 11 గ్రామా ల్లో 1,000 ఎకరాలు, వికారాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల్లో 600 ఎకరాల భూమి పోతుంది. పాత అలైన్మెంట్లో 189కిలో మీటర్లు ఉండగా, రెండో అలైన్మెంట్లో 201 కిలో మీటర్లకు పెంచారు. తాజాగా 218 కిలో మీటర్లకు మార్చాలని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘రేడియల్’తో మరిన్ని గ్రామాలు
గతంలో ఉన్న ఔటర్ రింగ్రోడ్డు నుంచి ట్రిపుల్ ఆర్ వరకు రేడియల్ రోడ్డు వేసేందుకు షాబాద్ మండలం మీదుగా పూడూరు మండలంలోని పుడుగుర్తి, కంకల్, మంచన్పల్లి, గట్టుపల్లి, మాదారం రంగాపూర్ గ్రామాల మీదుగా అనుసంధానం చేయనున్నారు. రైతులు వందల ఎకరాల్లో భూములు కోల్పోనున్నారు.
అరెస్టు దారుణం
ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులను అరెస్టు చేయడం దారుణమని సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి అ న్నారు. సోమవారం తెల్లవారుజామున పోలీసులు సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్, పూ డూరు రైతులు తాజొద్దీన్, నర్సింహారెడ్డి, సాయన్న, అనీల్, జంగయ్యను అరెస్టు చేసి చన్గోముల్ పోలీస్స్టేషన్కు తరలించారని తెలిపారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రైతులను విడిచిపెట్టారు.
మార్కెట్ ధర చెల్లించాలి
కొత్త అలైన్మెంట్తో చాలా మంది పేద రైతులే భూము లు కోల్పోతున్నారు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే ఊరుకోం. భూమికి భూమి ఇవ్వాలి. లేకుంటే మార్కెట్ ధర రూ.2 కోట్లు చెల్లించాలి. నామమాత్రపు పరిహారానికి ఒప్పుకోం. అభివృద్ధికి ఎవరూ అడ్డు చెప్పరు. అదే సమయంలో రైతుల సంక్షేమం కూడా చూడాలి.
– గోవర్ధన్రెడ్డి, బాధిత రైతు
అంతా పేద రైతులే
పూడూరులో చాలా మంది పేద రైతులే ఉన్నారు. రెండెకరాల్లో ఎకరం భూమి పోతే జీవనం ఇబ్బందిగా మారుతుంది. ఇక్కడి రైతులు ఏడాదికి మూడు పంటలు తీస్తున్నారు. కొత్త అలైన్మెంట్తో అందరికి తీరని నష్టం. నవాబులది పోతలే.. చిన్న సన్నకారు రైతులదే పోతోంది. పాత అలైన్మెంట్ ప్రకారమే రోడ్డు వేయాలి
– నర్సింహారెడ్డి, పూడూరు

ట్రిపుల్ఆర్ మంటలు

ట్రిపుల్ఆర్ మంటలు