
పింఛన్లు పెంచి ఇవ్వాలి
మహేశ్వరం: వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్లు పెంచి ఇవ్వాలని జిల్లా మహాజన సమితి అధ్యక్షుడు రావుగళ్ల బాబు మాదిగ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని నాగారం, కల్వకోల్, ఘట్టుపల్లి, ఆకన్నల్లి, మన్సాన్పల్లి, మహేశ్వరం, గంగారం, పెండ్యాల, నాగిరెడ్డిపల్లి, గొల్లూరు, సుభాన్పూర్, తుమ్మలూరు గ్రామాల్లో శనివారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టి కార్యదర్శులుకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలకు ముందు పింఛన్లు పెంచి ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో పాటు పాతవారికి వెంటనే పింఛన్లు పెంచి ఇవ్వాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి బక్కని రవి మాదిగ, మండల అధ్యక్షుడు ఎర్ర గణేష్ మాదిగ, ఎమ్మెస్పీ మండల అధ్యక్షుడు ఎర్ర కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
హామీ నిలబెట్టుకోవాలి
షాద్నగర్రూరల్: ఎన్నికల సమయంలో పెన్షన్పై ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొత్త పెన్షన్లను మంజూరు చేయడంతో పాటు పాత పెన్షన్ల ను పెంచాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నాగభూషణం ఆధ్వర్యంలో పంచాయితీ కార్యాలయాల్లో పెన్షన్దారులతో కలిసి ధర్నా చేపట్టి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల పెంపుకోసం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు 22 నెలలుగా ఎదుచూస్తున్నారని అన్నారు. పాత పెన్షన్లను పెంచడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేసేవరకు సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదన్నారు. కార్యక్రమంలో శివ, యాదగిరి, సాయిలు, అంజి, సువర్ణ, రాంచంద్రయ్య, జంగయ్య, మల్లయ్య, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

పింఛన్లు పెంచి ఇవ్వాలి