రీల్స్‌ కోసం బైక్‌పై ప్రమాదకర స్టంట్‌ | - | Sakshi
Sakshi News home page

రీల్స్‌ కోసం బైక్‌పై ప్రమాదకర స్టంట్‌

Jun 24 2025 7:37 AM | Updated on Jun 24 2025 7:37 AM

రీల్స్‌ కోసం బైక్‌పై ప్రమాదకర స్టంట్‌

రీల్స్‌ కోసం బైక్‌పై ప్రమాదకర స్టంట్‌

రాజేంద్రనగర్‌: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది యువకులు ఓ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనంపై అర్ధరాత్రి రీల్స్‌ కోసం స్టంట్‌ చేశారు. జాతీయ రహదారిపై ఈ స్టంట్‌ కొనసాగుతుండటంతో ఈ దారి గుండా వెళ్తున్న వారు తమ సెల్‌ఫోన్‌లో బంధించి ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ఇలాంటి స్టంట్‌ అర్ధరాత్రి వేళ జరుగుతుండటంతో పలువురు తమ ఎక్స్‌ వేదికల ద్వారా దీనిని సైబరాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకొని ఆర్‌జీఐ పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉండటం గమనార్హం. రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 21న అర్థరాత్రి 1.30 గంటల సమయంలో శంషాబాద్‌ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు ద్విచక్ర వాహనంపై శంషాబాద్‌ నుంచి ఆరాంఘర్‌ వైపు పయనమయ్యారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు మైనర్లతో పాటు ఐదుగురు యువకులు పయనిస్తూ రీల్స్‌ చేశారు. ప్రమాదభరితంగా ఈ జాతీయ రహదారిపై స్టంట్‌ నిర్వహించారు. ఈ దృశ్యాలను అటుగా వెళుతున్న పలువురు చిత్రీకరించి ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఈ రహదారి రాత్రి సమయాల్లో బిజీగా ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో వీఐపీల రాకపోకలతో అలర్ట్‌గా ఉంటుంది. ఈ స్టంట్‌ విషయమై పలువురు సైబరాబాద్‌ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను సోమవారం గుర్తించారు. ద్విచక్ర వాహనంతో పాటు ఐదుగురు యువకులను, ముగ్గురు మైనర్లను రాజేంద్రనగర్‌ పోలీసులకు సోమవారం సాయంత్రం అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎనిమిది మంది యువకుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement