
హస్తం.. నిర్వేదం!
కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హస్తం పార్టీలో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఎమ్మెల్యేలు మొదలు చోటా మోటా లీడర్ల వరకు అంతా నారాజ్లో ఉన్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు. పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో వారంతా నైరాశ్యంలోకి వెళ్లారు. అధినాయకుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారు కూడా ఏమీ చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి పదవి ఆశించి..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఇప్పటికే రెండు విడతలుగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయన ఇటీవల అలకపాన్పు ఎక్కడం, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించడంతో పీసీసీ చీఫ్ సహా ఇతర నేతలు బుజ్జగించారు. తాత్కాలికంగా శాంతించినప్పటికీ పదవి దక్కలేదనే అసంతృప్తి మాత్రం వెంటాడుతోంది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు.
డీసీసీ పీఠంపై సీనియర్ల కన్ను
ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందిన ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన డీసీసీని గాలికొదిలేశారు. నియోజకవర్గాల్లో ఎవరైనా సమావేశాలు ఏర్పాటు చేస్తే వెళ్లి రావడం మినహా పార్టీ పటిష్టత కోసం తీసుకుంటున్న చర్యలు కూడా ఏమీ లేవు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమించనున్నారనే ప్రచారం కూడా జరిగింది. దీంతో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత దేపభాస్కర్రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గానికి చెం దిన గౌరీసతీష్, భీంభరత్ మరికొంత మంది నేతలు ఈ పీఠాన్ని ఆశించారు. ఆ మేరకు వారు ముఖ్యనేతలను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ఇప్పటికీ వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి.
పుట్టిముంచనున్న సమన్వయ లేమి
ఉమ్మడి ఏపీలోనూ జిల్లా నేతలకు సముచిత స్థానం లభించేది. ఇటు మంత్రి వర్గంలోనే కాదు అటు పార్టీలోనూ జిల్లా నేతలు కీలకంగా వ్యవహరించేవారు. సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జిల్లా నేతలను పూర్తిగా విస్మరించింది. ఒకరిద్దరు తమ అనుచరులకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టడం మినహా ముఖ్య పదవులేవీ కేటాయించలేదు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ నుంచి కొత్తగా చేరిన నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి భీంభరత్ వర్గం ఏకంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్కు ఫిర్యాదు చేసింది. కొత్త, పాత నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ప్రస్తుత డీసీసీ చీఫ్ కూడా వారిని ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయకపోవడంతో ఆయా మండలాలు, గ్రామాల్లో పార్టీ రెండుగా చీలిపోయి కన్పిస్తోంది. అంతర్గత విభేదాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుట్టిముంచే ప్రమాదం లేకపోలేదు.
ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల దాకా..
పదవులు ఆశించి భంగపడిన నేతలు
డీసీసీ పీఠంపై పలువురి గురి
ఆశావహుల ఎదురుచూపులు
సంస్థాగత కమిటీల్లోనైనా సముచిత స్థానం దక్కేనా?
సామాజిక న్యాయం దక్కేనా..?
ఇప్పటి వరకు పార్టీలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. నామినేటెడ్ పదవుల్లోనూ వారే కీలకంగా ఉన్నారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంస్థాగత పదవుల్లోనూ 42 శాతం రిజర్వేషన్ పాటించి తీరాలని ఆదేశిస్తున్నా జిల్లాలో ఇప్పటి వరకు ఈ సూత్రం అమలు కాలేదు. కనీసం గ్రామ, మండల, బ్లాక్, జిల్లా కమిటీల్లోనైనా ఇతర నేతలకు సముచిత స్థానం దక్కుతుందో లేదో తేలిపోనుంది. జూలై 4లోగా సంస్థాగత కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జూలై మొదటి వారంలో రాష్ట్రానికి రానున్నారు. గ్రామ, మండల, బ్లాకు, జిల్లా, రాష్ట్ర కమిటీల ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పని చేస్తున్న సామాన్య ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులకు గుర్తింపు లభిస్తుందా అనేది వేచిచూడాలి.