
నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
షాద్నగర్ః ఉద్యోగ, ఉపాధ్యాయులకు నూతన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు రూ.700కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి రూ.180 కోట్లు మాత్రమే విడుదల చేసిందని అన్నారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి రెండేళ్లు గడిచిపోయిందన్నారు. కమిటీ నివేదికను అమలు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలని లేని పక్షంలో జేఏసీతో చర్చలు జరిపి దశల వారీగా పోరాటాలు చేసేందుకు వెనుకాడేది లేదని హెచ్చరించారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి వెంకటప్ప, నాయకులు రాములయ్య, జగన్నాథ్ శర్మ, బుగ్గ రాములు, శంకర్ నాయక్, రాములయ్య, యాదగిరి పాల్గొన్నారు.