
చైతన్యంతోనే సమస్యలకు పరిష్కారం
ఇబ్రహీంపట్నం: రాజకీయంగా చైతన్యవంతులై ఎదిగితేనే సమస్యలను పరిష్కరం అవుతాయని.. ఆ లక్ష్యం దిశగా ముందుకుసాగాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పురి శేఖర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా పోటీ చేయాలని పిలుపునిచ్చారు. సగరులు నివసిస్తున్న గ్రామాల్లో కుల గురువైన శ్రీ భగీరథ మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాయకత్వ పటిమతో సగరులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మార్క సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శ్రీకాంత్, నాయకులు నాగేశ్వర్, నవీన్ పాల్గొన్నారు.