
ఘనం.. రెండో బోనం
గోల్కొండ కోటకు వెల్లువలా భక్తులు
గోల్కొండ: గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి ఆదివారం 2వ బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కోటలోని నగినాబాగ్, రాణీమహల్ తదితర ప్రాంతాలన్నీ కిటకిటలాడాయి. మహిళలు నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించారు. అనంతరం తలలపై అందంగా అలంకరించిన బోనం కుండలతో కోటపైకి అమ్మవారి దర్శనానికి బయల్దేరి వెళ్లారు. గోల్కొండ ఫతే దర్వాజా నుంచి భక్తులు తొట్టెలతో ఊరేగింపుగా వచ్చారు. కోట చౌరస్తా శివసత్తుల పూనకాలతో ఆధ్యాత్మిక వాతావరణంతో నెలకొంది. ఆలయ కార్యనిర్వహణాధికారి వసంత, బోనాల ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్ కె.చంటిబాబు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు.

ఘనం.. రెండో బోనం