
నేడు డయల్ యువర్ డీఎం
షాద్నగర్రూరల్: బస్సు ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు షాద్నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఉష బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు 9959226287 నంబర్కు ఫోన్ చేసి ప్రజలు, ప్రయాణికులు సమస్యలు, సూచనలు, సలహాలను అందజేయాలని కోరారు.
‘పల్లె’కు నేతల పరామర్శ
హుడాకాంప్లెక్స్: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ను బుధవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలికి తీవ్రగాయమైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలిసి రవికుమార్ను ఆయన నివాసంలో పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థినతి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన్ను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాచం సత్యనారాయణ, కాచం సుష్మ, హైదరాబాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ సుశీలరెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బొల్ల శివశంకర్ నేత, మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్రెడ్డి, జీవీ సాగర్రెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, నాయకులు ఆడాల రమేష్, కొండల్రెడ్డి, మాధవరం నర్సింహరావు తదితరులు ఉన్నారు.
ఇంటి నుంచే సదరం స్లాట్స్
● దివ్యాంగులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు
● డీఆర్డీఓ శ్రీలత
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందని డీఆర్డీఓ శ్రీలత అన్నారు. బుధవారం కలెక్టరేట్లో దివ్యాంగులకు యూనిక్ డిజేబులిటీ ఐడీ కార్డు (యూడీఐడీ) జారీపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సదరం సర్టిఫికెట్ల జారీకి గతంలో ఏడు రకాల వికలత్వాలకు మాత్రమే అవకాశం ఉండేదని.. ప్రస్త్తుత ప్రభుత్వం మరో 14 వికలత్వాలను కలిపి మొత్తం 21 రకాలను చేసిందన్నారు. గతంలో సదరం స్లాట్స్ బుకింగ్ మీ సేవలో మాత్రమే వెసులుబాటు ఉండేదన్నారు. యూడీఐడీ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే ఇంటినుంచే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చునని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో వనస్థలిపురం ఆస్పత్రి, గాంఽధీ ఆస్పత్రిని యూడీఐడీకి కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా వాసులు ఆయా ఆస్పత్రుల్లో మాత్రమే తమ దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. యూడీఐడీ కార్డులు స్పీడ్ పోస్టులో నేరుగా ఇంటికే వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూయూఓ సంధ్యారాణి, డీపీఎం విజయశ్రీ, ఏపీఎం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓయూలో ఉమెన్స్ డే వేడుకలు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ఆర్ట్స్ కాలేజీలో బుధవారం జరిగిన మహిళా దినోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలో ప్రమోటింగ్ ఉమెన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, ఫాస్టరింగ్ ఎంపవర్మెంట్ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ప్రొ.కాశీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క మాట్లాడారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి సెక్రటరీ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, వీసీ ప్రొ.కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్ ప్రొ.సుధాకర్ రెడ్డి, యూజీసీ డీన్ ప్రొ.లావణ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. కాగా.. ఓయూ ఆర్ట్స్ కాలేజీ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్కకు జార్జిరెడ్డి పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు వర్సిటీ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు సమర్పించారు.