
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ● వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
బంజారాహిల్స్: వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. సోమవారం ఆయన బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని హాజరు పట్టిక పరిశీలించి పర్మనెంట్, తాత్కాలిక సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఆలస్యంగా రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బంది విజయలక్ష్మి సూపర్వైజర్ స్టాప్( పబ్లిక్ హెల్త్ నర్స్), నాగలక్ష్మి, పార్వతి ఏఎన్ఎంలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఆసుపత్రిలో టెస్టుల వివరాలు, బ్లడ్ షాంపుల్స్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని ఫార్మసీ కేంద్రం సందర్శించి మందులను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమం లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగ కార్తీక్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు