ఆస్తి కోసం హత్య..? | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం హత్య..?

Mar 19 2024 6:50 AM | Updated on Mar 19 2024 9:24 AM

లింగం(ఫైల్‌)   - Sakshi

లింగం(ఫైల్‌)

షాద్‌నగర్‌రూరల్‌: కష్టసుఖాల్లో తోడుండాల్సిన వారే కర్కషంగా వ్యవహరించారు. ఆస్తికోసం అయినవారే అంతమొందించారు. తల్లిదండ్రులు, అక్కాబావలు పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. భార్య రంగ ప్రవేశంతో పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హృదయవిదారక ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని కిషన్‌నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. గ్రామస్తులు, బంధువులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లింగం(32)కు మహేశ్వరం మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన జ్యోతితో నాలుగేళ్లక్రితం వివాహమైంది.

వీరికి ఒక కూతురు సంతానం. అత్తామామ, ఆడపడుచు వేధింపులు తట్టుకోలేక జ్యోతి కూతురుతో కలిసి పుట్టింటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆస్తిపై కన్నేసిన అక్కాబావ భూమిని లింగం తల్లి సత్తమ్మ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. లింగంను తప్పిస్తే ఆస్తి తమకే వస్తుందనే దురాశతో అతన్ని అంతమొందించేందుకు పథకం పన్నారు. తల్లిదండ్రులు, అక్కాబావలు తరుచూ లింగంతో గొడవ పడుతున్నారు. ఆదివారం తల్లిదండ్రులు మరోమారు ఘర్షణ పడ్డారు. విషయం తెలుసుకున్న అక్కాబావ గ్రామానికి చేరుకుని లింగంపై దాడి చేసి హత్య చేశారు.

విషయం బయటకు పొక్కకుండా మృతుడి ఇంటి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులను నమ్మించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భర్త మృతిపై జ్యోతి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి గాయాలను గుర్తించారు. హత్యగా భావించిన వారు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతుడి తల్లిదండ్రులను, అక్కాబావలను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement