● మానేరునదిలో నీటి కొరత ● జిల్లా కేంద్రంలో రోడ్లు శిథిలం ● ఏర్పాట్లలో అధికారులు ● భారీ విగ్రహాల నిమజ్జనంపై ప్రత్యేక దృష్టి
సిరిసిల్లటౌన్: వర్షం నిత్యం కురుస్తున్నా మానేరునదిలో నీటి లభ్యత అంతంతే ఉంది. వినాయకుల నిమజ్జనానికి కష్టంగా మారింది. గతేడాది ఈ సీజన్లో మానేరువాగు ఉధృతంగా ప్రవహించింది. భారీ వినాయకులను పూర్తిస్థాయిలో నిమజ్జనం అయ్యాయి. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. మరో వైపు పట్టణంలో లూజు వైర్లు, రోడ్లపై గుంతలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం.. ఎదురయ్యే సమస్యలు.. సవాళ్లపై ప్రత్యేక కథనం.
గుంతలతో చింతలు
జిల్లా కేంద్రంలో వందలాది సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారు. 28 అడుగుల భారీ వినాయక విగ్రహాలను నెలకొల్పారు. రూ.లక్షలు వెచ్చించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల పట్టణంతోపాటు విలీనగ్రామాలు పెద్దూరు, సర్దాపూర్, చిన్నబోనాల, పెద్దబోనాల, రాజీవ్నగర్, చంద్రంపేట, రగుడులో విగ్రహాలను ఏర్పాటు చేశారు. పట్టణంలో రోడ్లు ధ్వంసమయ్యాయి. మోకాల్లోతు గుంతలతో వినాయకులకు స్వాగతం పలుకుతున్నా యి. వారం రోజుల్లో నిమజ్జనం కాగా.. రోడ్లపై గుంతలను, లూజ్వైర్లు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తీగలను సరిచేయాలని భక్తులు కోరుతున్నారు.
అధికారులు అప్రమత్తం
జిల్లా కేంద్రంలో జరిగే నిమజ్జనోత్సవంపై అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, మున్సిపల్ కమిషనర్ ఎం.ఎ.ఖదీర్పాషా వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మానేరు బ్రిడ్జి వద్ద ప్రధాన నిమజ్జనం పాయింట్ ఏర్పాటు చేశారు. అక్కడే లోతైన కృత్రిమ కొలనులు సిద్ధం చేస్తున్నారు. విలీన గ్రామాలు రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూరు, సర్దాపూర్లలో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వినాయకులు తరలే రూట్లలో అడ్డుగా ఉన్న చెట్లకొమ్మలు తొలగించారు.
గుంతలతో ఉన్న ఈ రోడ్డు సంజీవయ్యనగర్. ఇక్కడ సీసీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు వేయాలని స్థానికులు ఏళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ ఏరియా నుంచి నిమజ్జనానికి వెళ్లే గణనాథులకు ఈ రోడ్డు ప్రమాదంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి విలీనగ్రామాల్లో, పట్టణంలో మెహెర్నగర్, రాళ్లబావి, పద్మనగర్, బీవైనగర్ తదితర ప్రాంతాల్లో నెలకొంది.
సిరిసిల్లలో వినాయకుల వివరాలు
గుర్తించిన వినాయకులు 370(ఇప్పటివరకు)
మొత్తం వార్డులు 39
నిమజ్జనం పాయింట్లు 08
మున్సిపల్ సిబ్బంది 100(మూడు షిఫ్టుల్లో)
నీటి కొరతపై ఆందోళన వద్దు


