● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: రైతులు కోడెలను రాజన్న ప్రసాదంగా భావించి సొంతింటి బిడ్డల్లా సంరక్షించుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ రాజన్న తిప్పాపూర్ గోశాలలోని 500 కోడెలను మంగళవారం రైతులకు అందజేశారు. గతంలో కోడెలను స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడం వల్ల ఎదురైన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని రైతులకు రాజన్న ప్రసాదంగా అందిస్తున్నామని అన్నారు. కోడెలను రైతుల పేరుతో తీసుకొని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనారోగ్య కోడెలను ఇతర వాటి నుంచి వేరు చేసి చికిత్స అందించేందుకు ఒక ఎకరం స్థలాన్ని కలెక్టర్ కేటాయించారన్నారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కోడెలకు టీకాలు, వైద్యం, నాణ్యమైన పోషకాహారం, దాణా అందిస్తున్నామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లకు పైగా నిధులతో పనులు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ గరీమ అగ్రవాల్, ఈవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్, కౌన్సిలర్ ఎల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


