తనిఖీ బృందాలోచ్చాయ్
● ‘పది’ విద్యార్థుల ప్రాజెక్టులు, ఎఫ్ఏ రికార్డుల పరిశీలన ● ఇంటర్నల్ మార్కుల తనిఖీ
గంభీరావుపేట(సిరిసిల్ల): పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చిన ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేయడానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా 26 బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సందర్శించి పదో తరగతి విద్యార్థుల ప్రాజెక్టులు, ఎఫ్ఏ, ఇంటర్నల్ మార్కులను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి అంతర్గత మార్కులు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ మార్కుల విషయంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మార్కులు, రికార్డులను పరిశీలించేందుకు విద్యాశాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. జిల్లాలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి దాదాపు 7 వేల మంది రికార్డులను పరిశీలిస్తున్నారు. పదో తరగతిలో ప్రతీ సబ్జెక్టుకు వంద మార్కులు ఉండగా.. 80 మార్కులకు వార్షిక పరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులకు సీసీఈ విధానంలో నాలుగు ఫార్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు రాసే రికార్డులు, ప్రాజెక్టుల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్కు ఈ మార్కులు కీలకంగా మారిన నేపథ్యంలో అధికారుల తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యార్థుల ప్రాజెక్ట్ వర్క్స్, చేతి రాత, ఎఫ్ఏలో వచ్చిన మార్కులను తనిఖీ బృందాలు పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు వాస్తవంగా మార్కులు వేశారా.. ఇష్టానుసారంగా వేశారా.. అనే విషయాలను తనిఖీ బృందాలు పరిశీలిస్తున్నాయి. కాగా, తనిఖీ బృందంలో గెజిటెడ్ హెచ్ఎం, లాంగ్వేజ్ టీచర్, నాన్ లాంగ్వేజ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్తోపాటు మరి కొందరు ఉపాధ్యాయులు కలిపి ఐదు నుంచి ఏడుగురు ఉన్నారు. ఒక్కో బృందానికి 7 నుంచి 10 పాఠశాలల బాధ్యతలను అప్పగించారు. ఈ ప్రక్రియను మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది.


