ఆర్టీసీకి కాసుల గలగల
మురిపించిన సమ్మక్క–సారలమ్మ జాతర
మహాశివరాత్రికి సమకూరిన ఆదాయం
వేములవాడ , సిరిసిల్ల డిపోలకు ఆర్థిక పరిపుష్టి
వేములవాడఅర్బన్: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా మూడు రోజులుగా నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల సందర్భంగా వేములవాడ, సిరిసిల్ల ఆర్టీసీ డిపోలకు ఆదాయం సమకూరింది. ఆర్టీసీ అధికారులు బస్టాండ్ల వద్ద భక్తులకు, ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రెండు డిపోలలో మహాశివరాత్రికి భారీగానే ఆదాయం వచ్చింది. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా కూడా వేములవాడ, సిరిసిల్ల డిపోల నుంచి ఆరు రోజులపాటు మేడారం బస్సులను నడిపించారు. మేడారం ద్వారా కూడ ఆర్టీసీకి ఆదాయం సమకూరింది.
సమ్మక్క సారలమ్మ ఆదాయం
వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి ఈ సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా ఆరు రోజులగా 50 బస్సులను నడిపించారు. ఆరు రోజుల ఆదాయం సుమారుగా రూ.55 లక్షలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. గత సమ్మక్క–సారలమ్మ జాతరకు ఆరు రోజులు 35 బస్సులు నడిపించగా రూ.61 లక్షలు ఆదాయం సమకూరింది. సిరిసిల్ల డిపో నుంచి ఈసారి సమ్మక్క– సారలమ్మ జాతరకు ఆరు రోజులపాటు 36 బస్సులు నడిపించగా రూ.61 లక్షల ఆదాయం సమాకురినట్లు తెలిపారు.
మహాశివరాత్రి సంబురం
వేములవాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో మహాశివరాత్రికి మూడు రోజులు 25 బస్సులు నడిపించగా సుమారు రూ.20 లక్షలు ఆదాయం సమాకూరింది. గతేడాది మహాశివరాత్రికి 25 బస్సులకు రూ.26 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సిరిసిల్ల డిపో నుంచి ఈసారి మహాశివరాత్రికి 20 బస్సులను నడిపించగా మూడు రోజులలో రూ.8 లక్షల ఆదాయం సమకూరింది.


