పకడ్బందీగా ఎన్నికల కౌంటింగ్
● ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్లటౌన్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ సినారె కళామందిరాల్లో గురువారం మాక్ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్తో కలిసి పరిశీలించి మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో సినారె కళామందిరాల్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచామని, ఇప్పటికే ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి ఏర్పాట్లు పరిశీలించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని వివరించారు. ఒక్కో వార్డుకు ఒక టేబుల్ చొప్పున.. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, మూడు టేబుళ్లకు కలిపి ఒక ఆర్ఓ, ఏఆర్ఓ ఉంటారని వివరించారు. సిరిసిల్లలో 39 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 78 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, వేములవాడలో 28 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 56 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించినట్లు తెలిపారు. ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్పాషా, సంపత్కుమార్, ఎన్నికల విభాగం అధికారులు శ్రీనివాసాచారి, మీర్జా ఫసహత్ అలీ బేగ్, అన్సార్ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రక్రియను కలెక్టర్ పూర్తి చేశారు. డీఈవో జగన్మోహన్రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఈడీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
మహాశివరాత్రి జాతరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్, జాతర కమిటీ చైర్పర్సన్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. గురువారం అన్ని శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతో విధులు నిర్వర్తించి విజయవంతం చేయాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో, వేములవాడ మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి సంయుక్తంగా ఆలయ పరిసరాలు, పార్కింగ్ స్థలాలు, క్యూలైన్ల వద్ద మూడు షిఫ్టుల్లో సిబ్బంది ఉండేలా చూడాలని ఆదేశించారు. బస్టాండ్, పార్కింగ్ స్థలాలు, ఇతర చోట్ల హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భీమన్న ఆలయం, ప్రసాదం కౌంటర్, పార్కింగ్ స్థలాలు ఇతర చోట్ల వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్లతో సిద్ధంగా ఉండాలని వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జాతర పరిసరాల్లో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా చూడాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్చైర్లు, వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో ఎస్పీ మహేశ్ బీ గీతే, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, ఆలయ ఈవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


