
చెత్తశుద్ధి కరువు!
మున్సిపల్ సమాచారం
● తరచూ మరమ్మతుకు వాహనాలు ● కాలనీల్లో పేరుకుపోతున్న చెత్త ● కంపు కొడుతున్న అంతర్గత కాలనీలు ● ఇబ్బంది పడుతున్న వేములవాడ ప్రజలు
వేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం.. దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని అంతర్గత కాలనీలు కంపు కొడుతున్నాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు, స్థానిక ప్రజలు, వ్యాపార సంస్థల నుంచి వెలువడుతున్న చెత్త పేరుకుపోతుంది. చెత్తను తొలగించే సిబ్బంది కొరత ఉండడం.. సేకరించిన చెత్తను తరలించే వాహనాలు మరమ్మతుకు రావడంతో పట్టణం కంపుకొడుతుంది. వేములవాడలో పారిశుధ్య నిర్వహణపై ‘సాక్షి’ ఫోకస్.
పేరుకుపోతున్న చెత్త
వేములవాడ మున్సిపల్ పరిధిలో విలీన గ్రామాలను కలిపి 28 వార్డులు ఉన్నాయి. గతంలో జనాభాను అనుసరించి మున్సిపల్ సిబ్బందిని నియమించారు. కానీ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పట్టణం సైతం రద్దీగా మారుతుంది. భక్తుల ద్వారా వెలువడుతున్న చెత్తను సేకరించడం సవాల్గా మారింది. ఈక్రమంలోనే మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది కొరత ఏర్పడుతుంది. ప్రతి రోజు వార్డుల్లో శుభ్రం చేసినా మధ్యాహ్నం వరకు చెత్తగా మారుతున్నాయని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. పారిశుధ్య సిబ్బందిని పెంచాలని కోరుతున్నారు. విలీన గ్రామాల్లో సిబ్బంది కొరతతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు అంటున్నారు.
సరిపోని చెత్త వాహనాలు
వేములవాడలో నిత్యం రాజన్న భక్తులు, ఆలయం చుట్టూ లాడ్జీలు, దుకాణాలు, హోటళ్లు ఉండడంతో అధిక మొత్తంలో చెత్త ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాంతంలో పారిశుధ్య సిబ్బంది నిత్యం రెండు పూటల చెత్తను సేకరిస్తున్నా మళ్లీ కుప్పలుగా పేరుకుపోతుంది. మున్సిపల్లో పారిశుధ్య సిబ్బంది 146 మంది ఉన్నా సరిపోవడం లేదు. ప్రత్యేకంగా చెత్తవాహనాలు నడిపేందుకు డ్రైవర్లు లేకపోవడంతో ఇందులో నుంచి డ్రైవర్లుగా మారుతున్నారు. వాహనాలు పాతవి కావడంతో తరచూ రిపేర్కు వెళ్తుంటాయి. ఆరేళ్ల క్రితం కొనుగోలు చేసిన వాహనాలతోనే వెల్లదీస్తున్నారు. ఇప్పటి జనాభా, చెత్త ఉత్పత్తిని బట్టి కనీసం 240 మంది పారిశుధ్య సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మూడు చోట్ల బస్స్టాండ్లు
వేములవాడ ఆధ్యాత్మిక పట్టణం కావడంతో రాజన్న దర్శనానికి వచ్చే భక్తులతో రద్దీగా మారుతుంది. వేములవాడలో మూడు చోట్ల బస్టాండ్లు ఉన్నాయి. తిప్పాపూర్లో మొయిన్ ఆర్టీసీ బస్టాండ్ ఉండగా, గుడిచెరువు కట్ట కింద జగిత్యాలకు వెళ్లే బస్సులు ఉంటాయి. ఈ రెండు ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. మూడో బస్టాండ్ పట్టణంలోని కోరుట్ల వైపు వెళ్లే ప్రాంతంలో పెట్రోల్బంక్ సమీపంలో ఉంటుంది. ఈ మూడు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటారు.
వార్డులు : 28, జనాభా : 56 వేలు
కుటుంబాలు : 10,600
పారిశుధ్య కార్మికులు : 146
జవాన్లు : 05, చెత్త ట్రాక్టర్లు : 08
చెత్త ఆటోలు : 20
రిపేర్లో ఉన్నవి : 03
ప్రతీరోజు చెత్త సేకరణ : 21 టన్నులు

చెత్తశుద్ధి కరువు!

చెత్తశుద్ధి కరువు!