
వంతెన.. ఇంతేనా..
‘ఇది కోనరావుపేట మండలం వట్టిమల్ల–నిమ్మపల్లి మధ్య మూలవాగుపై 2007లో నిర్మించిన లోలెవల్ వంతెన. మూలవాగు ప్రాజెక్టు మిగులు జలాలు వేగంగా రావడంతో ఈసారి వంతెన వద్ద రోడ్డు కోతకు గురైంది. ఏటా ఇది సాధారణమైన విషయమైపోయింది. వట్టిమల్ల గ్రామస్తులు సొంత డబ్బుతో కోతకు గురైన ప్రదేశంలో పైపులు వేసి మట్టి పోసుకుని నిమ్మపల్లి వైపు రాకపోకలు సాగించేలా తాత్కాలిక మరమ్మతు చేసుకున్నారు.
● వాగుదాటేదెలా..? ● ఏటా తాత్కాలిక మరమ్మతులేనా.. ● నిధులు రావు.. పనులు సాగవు ● ఆర్అండ్బీ రోడ్ల వంతెనలకు మోక్షం ఎప్పుడో..?
సిరిసిల్ల: వానాకాలంలో జిల్లాలోని పలుచోట్ల లోలెవల్ వంతెనలు నీటమునిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు చోట్ల వరద ధాటికి వంతెనలు కొట్టుకుపోగా తాత్కాలిక మరమ్మతుతో సరిపెడుతున్నారు. కోనరావుపేట మండలంలోని మూలవాగుపై మూడు హైలెవల్ వంతెనలు, కొండాపూర్ శివారులోని పెట్టివాగుపై మరో హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.58 కోట్లు మంజూరు చేస్తూ 2022లో ప్రొసీడింగ్ వచ్చింది. కానీ వర్క్ ఆర్డర్ లేని, టెండర్ కాని పనులను 2023లో రద్దు చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అభివృద్ధి స్వరూపం మారిపోతుంది. మళ్లీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు వంతెనల నిర్మాణానికి డీపీఆర్ తయారు చేయాలని, హెచ్ఏఎం విధానంలో 60 శాతం నిధులు రుణం, మరో 40 శాతం నిధులు గ్రాంటు రూపంలో ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ, ఈ నిధులు ఎప్పుడు మంజూరవుతాయో, పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియక గ్రామీణులు రోడ్డు కష్టాలు ఎదుర్కొంటున్నారు.
నిధులున్నా..
గంభీరావుపేట మండల కేంద్రం నుంచి లింగన్నపేట మీదుగా ముస్తాబాద్, సిద్దిపేట వెళ్లే దారిలో మానేరువాగుపై వంతెన నిర్మాణానికి నిధులున్నా పనులు సాగడం లేదు. గంభీరావుపేట– లింగన్నపేట మధ్య హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.6.55 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టు పొందిన సంస్థ పనులు చేయకుండా మధ్యలో వదిలేసింది. వాగులో కొద్దిగా పిల్లర్లు పోశారు. పక్కనుంచి తాత్కాలిక మట్టి రోడ్డు వేశారు. కానీ, వరదల ధాటికి రోడ్డు కొట్టుకుపోయింది. పిల్లర్లు వంగిపోయాయి. కాంట్రాక్టర్ నిర్వాకంతో పనులు అర్ధాంతరంగా ఆగాయి. ఇవే కాకుండా వీర్నపల్లి మండలం అడవిపదిర వాగుపై రూ.2.40 కోట్లతో నిర్మిస్తున్న వంతెనను కాంట్రాక్టర్ మధ్యలో వదిలేశాడు. దీంతో ఎల్లారెడ్డిపేట–మరిమడ్ల మధ్య రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇలా నిధులు లేక కొన్ని వంతెనలు మొదలేకాలేదు. కొన్ని వంతెనలు నిధులున్నా కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదు. ఇప్పటికై నా పాలకులు క్షేత్రస్థాయిలో వాస్తవాలను గమనించి వంతెనల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని గ్రామీణులు కోరుతున్నారు.

వంతెన.. ఇంతేనా..