కురిచేడులో అనుమతి లేని
ఓ లేఔట్
కురిచేడు: తనది కాని భూమిని చూపి, లేఔట్ వేసి వప్లాట్లు విక్రయిస్తున్నట్లు నమ్మించి ఏకంగా రూ.25 లక్షలు దోచుకున్న ఘరానా మోసం కురిచేడులో వెలుగుచూసింది. ఎస్సై జి.కోటయ్య కథనం ప్రకారం.. విజయవాడ భారతి ఇంటర్మీడియట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న పావులూరి నీలిమకు బుల్లా విజయ్కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. కురిచేడు మండలం పడమరగంగవరం సర్వే నంబర్ 89/2లోని 6.95 ఎకరాల భూమి తనదేనని నమ్మబలికాడు. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్తో ఇక్కడ భూములకు భారీ డిమాండ్ ఉంటుందని ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన నీలిమ.. మొదట రూ.3.25 లక్షలతో రెండు ప్లాట్లు (డాక్యుమెంట్ నంబర్ 1681/2025), ఆ తర్వాత రూ.20 లక్షలతో మరో 2 వేల చదరపు గజాల స్థలాన్ని (డాక్యుమెంట్ నంబర్ 13847/2025) రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే డాక్యుమెంట్లలో ఉన్న స్థలానికి, భౌతికంగా చూపించిన భూమికి పొంతన లేకపోవడంతో మోసపోయానని ఆమె గ్రహించారు. దీనిపై నిలదీయగా విజయ్కుమార్ ముఖం చాటేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కన్వర్షన్ లేకుండానే దందా..
వ్యవసాయ భూములను జాయింట్ కలెక్టర్(జేసీ) ద్వారా కన్వర్షన్ చేయకుండానే మండలంలో 10కి పైగా అక్రమ లేఔట్లు వెలిశాయి. వీటికి పంచాయతీ కార్యదర్శులు సైతం అప్రూవల్ ఇస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. జిల్లా అధికారులు మొద్దునిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలు మరింత మోసపోయే ప్రమాదం పొంచి ఉంది.
విజయవాడ మహిళ ఫిర్యాదుపై చీటింగ్ కేసు నమోదు
కురిచేడు మండలంలో రోజుకో భూదందా వెలుగులోకి..
జేసీ కన్వర్షన్ లేకుండా సాగు భూముల్లో ప్లాట్లు


