ఒంగోలు టౌన్: పోలీసు విచారణలో ఉన్న ఒక రౌడీ షీటర్ పరారయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన వెంకట్ పై తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉంది. రెండు రోజుల క్రితం ఒక కేసులో అతడిని డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 3 గంటల మధ్య భోజనం సమయంలో వెంకట్ తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. తీరిగ్గా చూసుకున్న పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ఇటీవల తాలూకా పోలీసు స్టేషన్ నుంచి గంజాయి కేసు నిందితుడు ఒకరు పారిపోవడం తెల్సిందే. వెనువెంటనే జరిగిన ఘటనలపై ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సీరియస్ అయినట్లు సమాచారం.
మార్కాపురం టౌన్: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం విజయసునీత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. అర్జీదారులు 1100 నంబర్కు కాల్ చేసి అర్జీ నమోదు చేసుకోవడంతో పాటు వారి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
కొండపి: ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొండపి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పచ్చవ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ పచ్చవ శ్రీను (60) వ్యక్తిగత పనుల నిమిత్తం కొండపి వచ్చారు. సాయంత్రం పనులు ముగించుకొని స్వగ్రామానికి బయలుదేరేడు.తిరుగు ప్రయాణంలో కొండపిలోని స్థానిక ఎస్సీ హాస్టల్ మలుపు వద్దకు వచ్చేసరికి వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనంలో స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు జీజీహెచ్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృత ఇచెందారు.
కొండపి: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని పాముకాటుకు గురైంది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మధ్యాహ్నం భోజన సమయంలో విద్యార్థులంతా భోజనశాలకు వెళ్లగా భోజనశాలలోనికి పాము వచ్చింది. 9వ తరగతికి చెందిన కడియం మోక్షిత 14 కాళ్ల దగ్గర అలజడి కావడంతో ఒక్కసారిగా కాలును విదిలించడంతో అప్పటికే అక్కడ ఉన్న పాము కాటు వేసింది. సమాచారం అందుకున్న ఉపాధ్యాయులు మోక్షితను వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించి వైద్యాన్ని అందించారు. విద్యార్థిని సురక్షితంగా ఉన్నట్లు వైద్యశాల సిబ్బంది తెలిపారు. మంత్రి స్వామి విద్యార్థిని పరాపర్శించారు. మోక్షితను ఎంపీడీఓ బి.రామాంజనేయులు, ఎంఈఓ కె.సురేఖ, గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ ఎస్.శైలజ, పాఠశాల ప్రిన్సిపాల్ పి.జయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ వి.జ్యోతి పరామర్శించారు. విద్యార్థినికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. పాములు పట్టే వారిని పిలిపించి హాస్టల్ లోని అన్ని గదుల్లోనూ గాలించినట్లు ఎంపీడీవో తెలిపారు


