యర్రగొండపాలెం: దట్టమైన నల్లమల అడవిలో కృష్ణానది ఒడ్డున వెలసిన పాలంక వీరభద్ర స్వామి తిరునాళ్ల శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణం కనుల పండుగగా జరిగింది. స్వామి కరుణ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులు వేలాది మంది వివిధ వాహనాల్లో కాలినడకన అక్కడికి బయలు దేరి వెళ్లారు. పాలంకేశ్వరుడితోపాటు అక్కడ వెలసిన వీరభద్రస్వామి, గణపతి, పంచముఖ బ్రహ్మ పోతురాజుల ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఆ ప్రాంగణంలో ఉన్న బిడ్డలు లేని దంపతులు సంతానగద్దె వద్ద పై నుంచి జాలువారే నీటి బిందువుల కోసం క్యూ కట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అనారోగ్యానికి గురికాకుండా పాలుట్ల పీహెచ్సీ వైద్యులు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అటవీ జంతువులకు హాని జరగకుండా, పాలంకకు చేరిన భక్తులను జంతువుల నుంచి సంరక్షించటానికి ఆ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సీఐ విజయకుమార్ ఆధ్వర్యంలో ఎస్సై ఎం.దేవకుమార్ తమ సిబ్బందితో శాంతి భద్రతలను కాపాడారు.


