● విలేకరుల సమావేశంలో కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు సబర్బన్:
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం 4.0)లను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. స్థానిక ప్రకాశం భవన్లోని సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను కలెక్టర్ వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,556 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు అందుబాటులో ఉండగా, వీటిలో 1,07,243 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం రూ.34,72,200 నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఎంఈఓల ద్వారా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఖాతాల్లో ఇప్పటికే జమ చేశామన్నారు. పాఠశాలల్లో పండుగ వాతావరణం నింపేందుకు తల్లిదండ్రులకు సరదాగా ఆటల పోటీలు నిర్వహించనున్నారని, తల్లిదండ్రులంతా పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక, సమగ్రశిక్ష జిల్లా కో ఆర్డినేటర్ డి.అనిల్ కుమార్ పాల్గొన్నారు.


