భీకర గాలులతో అపార నష్టం
● పామూరు మండలంలో నేలరాలిన మామిడి, ఒరిగిన నిమ్మ చెట్లు
● మర్రిపూడి మండలంలో కూలిన విద్యుత్ స్తంభాలు
పామూరు/మర్రిపూడి: ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి, మార్కాపురం జిల్లాలోని పామూరు మండలాల్లో మంగళవారం సాయంత్రం, రాత్రి వీచిన బలమైన ఈదురు గాలుల ధాటికి మామిడి, నిమ్మ తోటలకు నష్టం వాటిల్లడంతోపాటు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దూబగుంట్ల వద్ద పామూరుకు చెందిన గువ్వల నరసింహం రూ.4 లక్షలకు లీజుకు తీసుకున్న 13 ఎకరాల మామిడి తోటలో కాయలు భారీగా నేలరాలాయి. అయ్యవారిపల్లె వద్ద రైతులు చింతలపూడి రామచంద్రయ్య, శాంతమ్మకు చెందిన 225కు పైగా నిమ్మ చెట్లు, కొన్ని మామిడి చెట్లు ఒరిగిపోయాయి. సీఎస్పురం మండలంలోని చింతపూడి గ్రామంలో మామిడి కాయలు నేలరాలాయి.
మర్రిపూడి పంచాయతీ రాజుపాలెం గ్రామంలో అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం సగానికి విరిగి పడింది. చిమట గ్రామ పొలాల్లో 2 స్తంభాలు, మర్రిపూడిలో 3 స్తంభాలు, మర్రిపూడి కొండ పొలంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కూలి విద్యుత్ తీగలు తెగిపోయాయి. మరికొన్ని విద్యుత్ స్తంభాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పొట్టిరెడ్డిపాలెం వద్ద మామిడి తోటలో కాయలు పూర్తిగా రాలిపోవడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. అంకేపల్లి, గంగపాలెం, మర్రిపూడి, దుగ్గిరెడ్డిపాలెం, వల్లాయపాలెం తదితర గ్రామాలల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


