● 8 నెలలుగా తాగునీటి కోసం అవస్థ పడుతున్నాం
● బిందెలతో చలివేంద్ర గ్రామస్తుల నిరసన
దర్శి: దర్శి పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చలివేంద్ర గ్రామానికి తాగునీరు ఇవ్వడం లేదని గ్రామస్తులు మంగళవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు నెదర్లాండ్ తాగునీటి రిజర్వాయర్కు కూతవేటు దూరంలో చలివేంద్ర గ్రామం ఉంది. గత ప్రభుత్వంలో గ్రామానికి నిత్యం నీరు సరఫరా అయ్యేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వారం, పది రోజులకు, నెలకు ఒక సారి నీరివ్వడం మొదలుపెట్టారు. అలా ఒక సంవత్సరం తరువాత పూర్తిగా నీరివ్వడం మానేశారు. ప్రస్తుతం గ్రామానికి తాగునీరు ఇచ్చి ఎనిమిది నెలలైందని మహిళలు వాపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గ్రామంలో నీటి ట్యాంక్ వద్ద ఖాళీ బిందెలతో తమ నిరసన తెలిపారు.
నెల్లూరు (టౌన్): పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో కందుకూరు నియోజకవర్గంలో తక్కువ పాస్ పర్సంటేజీ వచ్చిన కేజీబీవీల ప్రిన్సిపల్స్, పీజీటీలకు నోటీసులను సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర యావరేజ్ 85 శాతం కాగా, 79.5 శాతం ఫలితాలు రావడంతో గుడ్లూరులోని మొగళ్లూరు కేజీబీవీ ప్రిన్సిపల్స్కు నోటీసులు పంపారు. ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు 81 శాతం కాగా, కందుకూరు నియోజకవర్గంలోని వలేటివారిపాలెంలో 75, ఉలవపాడులో 77, కందుకూరులో 45.8, లింగసముద్రంలో 66.6 శాతం ఉత్తీర్ణత రావడంతో అక్కడి కేజీబీవీల ప్రిన్సిపల్స్కు నోటీసులను జారీ చేశారు. వీరితో పాటు ఆయా సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు రావడంతో ఐదుగురు పీజీటీలకూ నోటీసులు జారీ అయ్యాయి. వీరందరూ వారంలో వివరణ పంపాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీటిని సమగ్రశిక్ష రాష్ట్ర అధికారులకు పంపి, వారి నిర్ణయం మేరకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.


