● ఏడుగురు కూలీలకు గాయాలు
కొండపి: కూలీల ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని చిన్న వెంకన్నపాలెం సమీపంలోని సబ్స్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం..మండలంలోని నేతివారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు టంగుటూరు మండలంలోని ఒక ప్రైవేట్ పొగాకు కంపెనీలో కూలి పనులకు వెళుతుంటారు. మంగళవారం కూడా వెన్నూరు గ్రామానికి చెందిన ఆటోలో కంపెనీకి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగామండలంలోని చిన్న వెంకన్నపాలెం సబ్ స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి ముందుగా వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా పక్కకు వెళ్లడంతో ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళా కూలీలంతా గాయపడ్డారు. వారిలో ఈశ్వరమ్మ, గోవిందమ్మ, దేవమ్మ, ఆటో డ్రైవర్ సుబ్బారావులకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు.


