ఒంగోలు టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 66 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు వారితో నేరుగా మాట్లాడి సమస్య పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను చట్టపరిధిలో విచారణ చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. నడవలేని స్థితిలో వచ్చిన బాధితుల వద్దకు వచ్చిన ఎస్పీ స్వయంగా వారి సమస్యలను ఆలకించడమే కాకుండా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల సమస్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ పి.శ్రీధర్, ట్రాఫిక్ సీఐ హజరత్తయ్య, సంతమాగులూరు సీఐ శేషగిరి రావు, కొండపి సీఐ రమణయ్య, ప్యానల్ అడ్వకేట్ బాలాజీసింగ్, మీ కోసం ఎస్సై జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు.


