మంత్రి ఇలాఖాలో
సాక్షి టాస్క్ఫోర్స్:
కొండపి మండలం పెద్దకండ్లగుంటలో టీడీపీ నాయకులు అక్రమాలకు తెరలేపారు. కోర్టులో స్టే ఉన్న ప్రదేశంలో లెవెలింగ్ పనులు ప్రారంభించారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో గ్రామ సర్వే నంబర్ 195/4లో 35 ప్లాట్లు వేశారు. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ఎటువంటి ప్రొసీడింగ్స్ లేకుండా అప్పటి ఎమ్మెల్యే స్వామి ప్రోద్బలంతో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. అనంతరం తహసీల్దార్ చిరంజీవి, ఎమ్మెల్యే స్వామిలు కలిసి నల్లపుకొండ స్వామి, దాసరి మాలకొండయ్య, గర్నిపూడి సుందరరావు, దంతం హరిబాబు, మల్లవరపు శేషయ్యలకు ప్లాట్లు ఇచ్చారు. మిగిలిన వారికి కూడా ఇస్తామన్నారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న కాలనీల పేరుతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. 195/1 సర్వే నంబర్లు బీసీ, ఓసీలకు, 195/4 సర్వే నంబర్లు ఎస్సీలకు జగనన్న కాలనీలో ఇళ్లు మంజూరు చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. 195/4లో తమకు ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని 45 మంది 2020 మే 15న కోర్టుకు వెళ్లారు. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ అదే ఏడాది మే 30న ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అధికారులు సమాచారం కోరారు. ఒక్క కోర్టుకు సంబంధించిన ఆర్డర్ మాత్రమే తమ వద్ద ఉందని, దానికి ప్రొసీడింగ్స్ కూడా లేవని ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అధికారులు ఆయనకు సమాచారం అందించారు. 2021లో అప్పటి తహసీల్దార్ 195/4లో ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేయాలని కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఆ స్థలంపై 7029/2020 నంబర్తో హైకోర్టులో స్టే ఆర్డర్ ఉంది.
ఇప్పుడు ఇలా..
కోర్టులో పెండింగ్లో ఉన్న స్థలంలో ఎవరూ ఎటువంటి పనులు చేసేందుకు అవకాశం లేదు. తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, తాము ఏది చేసినా చెల్లుతుందన్న ధోరణితో కూటమి నాయకులు కోర్టులో పెండింగ్లో ఉన్న స్థలంలో నూతనంగా మళ్లీ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని కొత్త నాటకానికి తెరలేపారు. అంతటితో ఆగకుండా లెవలింగ్ పనులు కూడా ప్రారంభించారు. అప్పట్లో ఆ స్థలంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పటికీ రద్దు కాలేదు. అప్పటి లబ్ధిదారుల్లో 21 మందికి జగనన్న కాలనీలో ఇళ్లు కూడా మంజూరయ్యాయి. కోర్టు పరిధిలో ఉన్న స్థలంతో పాటు దాని వెనుకే ఉన్న ఉన్న సర్వే నంబర్ 125లో పోరంబోకు భూమిని కొంతమేర ఆక్రమించి లెవెలింగ్ పనులు చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొండపి
నియోజకవర్గంలో టీడీపీ
నాయకులది ఇష్టారాజ్యమైంది. కూటమి నాయకులు అక్రమంగా డబ్బులు సంపాదించేందుకు దొడ్డిదారులు వెతుకుతున్నారు. కోర్టు ఆర్డర్లను సైతం ధిక్కరిస్తూ ప్రభుత్వం తమదే అనే ధీమాతో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా
అధికారులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అందిన కాడికి దండుకుంటున్నారు.
ఇళ్ల స్థలాల స్వాధీనానికి
టీడీపీ నేతల ప్లాన్
కోర్టులో ఉన్న స్థలంలో ఇళ్ల పట్టాల కోసం కుయుక్తులు
అప్పట్లో ఆర్డీవో ప్రొసీడింగ్స్
లేకుండానే నివేశన స్థలాల పంపిణీ
ప్రభుత్వ నిధులు కాజేసేందుకు అదే సర్వే నంబర్లో లెవలింగ్ పనులు
ఆదాయం కోసం అన్వేషణ
పేదలకు పట్టాలివ్వాలన్న సాకుతో లెవలింగ్ పనుల ద్వారా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఉద్దేశంతో కూటమి నాయకులు అధికారుల చుట్టూ ప్రస్తుతం ప్రదిక్షణాలు చేస్తున్నారు. ముఖ్యంగా నిధులను ఉపాధి హామీ పథకం ద్వారా డ్రా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి నేతల కుట్రలకు అధికారులు సహకరిస్తారా..? అన్న ప్రశ్న స్థానికుల్లో ఉత్పన్నమైంది. అసలు కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ఏ విధంగా పనులు చేస్తారని ప్రజలు, కూటమిలో ఒక వర్గం నాయకులు చర్చించుకోవడం గమనార్హం.


