మార్కాపురం టౌన్: మార్కాపురం ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ నాగరాజు హెచ్చరించారు. చెడ్డీ గ్యాంగ్ కదలికల సమాచారంతో శనివారం పట్టణంలోని లాడ్జిలు, శివారు ప్రాంతాలను పోలీసు అధికారులు తమ సిబ్బందితో తనిఖీలు చేశారు. పట్టణ శివారుల్లో గుడారాలు వేసుకుని ఉన్న అనుమానితులను ప్రశ్నించారు. వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో ఇళ్ల తలుపులు, కిటికీలు బిగించి పెట్టుకోవాలని, అనుమానాస్పదంగా కనిపిస్తే సమీప పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. అపరిచితులను ఇంట్లోకి అనుమతించొద్దని, నగదు, బంగారు ఆభరణాలు భద్రంగా ఉంచుకోవాలన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఒంటరిగా ఉన్న వృద్ధులు, మహిళల ఇళ్లపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా వాహనాలు, వ్యక్తులు కనిపిస్తే డయల్ 100, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ ముమ్మరం చేసినట్లు డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు.
డీఎస్పీ నాగరాజు


