బేస్తవారిపేట: ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని కొత్తపల్లి సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. మండలంలోని అక్కపల్లి గ్రామానికి చెందిన కొమ్మ పెద్దరంగమ్మ (41) తన భర్త సైదయ్యతో కలిసి ద్విచక్ర వాహనంపై బేస్తవారిపేట వెళ్తోంది. కొత్తపల్లి గ్రామ సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన పెద్దరంగమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
పెద్దదోర్నాల: చీరకు నిప్పంటుకుని ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని నల్లగుంట్లలో శుక్రవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన మూగెమ్మ చీరకు నిప్పంటుకుని శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. భర్త గురవయ్య అందించిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి వంట చేసేందుకు పొయ్యి దగ్గరకు వెళ్లిన మూగెమ్మకు ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకుంది. దీంతో మంటల చెలరేగటంతో 50 శాతానికిపైగా శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారాన్ని అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన నల్లగుంట్లకు చేరుకుని క్షతగాత్రురాలిని మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దీంతో వైద్యాధికారులు ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.


