కందుకూరు: వృద్ధులకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకుని మోసం చేస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై పులి శివనాగరాజు శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణంలోని పామూరు బస్టాండ్లో బస్సు కోసం ఒంటిరిగా నిలబడి ఉండే వృద్ధులను ముఠా సభ్యులు లక్ష్యంగా చేసుకుంటారు. వారితో మాటలు కలిపి తాము మీ ఊరికే వెళ్తున్నామంటూ నమ్మించి కారులో ఎక్కించుకుంటారు. అనంతరం పట్టణం దాటిన తర్వాత కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న బంగారు నగలు, డబ్బు లాక్కుంటారు. అనంతరం వారిని బహిరంగ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోతారు. బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేసి ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు సవర్ల బంగారు ఉంగరాలు, నేరానికి ఉపయోగించిన కారు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తమ కారులో వదిలిపెడతామని మాయమాటలు చెప్పితే వారిని నమ్మవద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.


