జె.పంగులూరు: మండల పరిధిలోని కొండమూరు ఎస్సీ కాలనీకి అగ్ని ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం సమీపంలోని రైతులు మొక్కజొన్న దండు (వ్యర్థాలు)కు నిప్పంటించారు. వేసవి కాలం కావడంతో ఎండ వేడి, వడగాడ్పులకు చుట్టుపక్కల పొలాలకు క్షణాల్లో మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీ వైపు కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. ఎస్సీ కాలనీ వాసులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చే లోపు కాలనీ వాసులు తమ వద్ద ఉన్న మోటార్ల సాయంతో మంటలు కాలనీలోకి రాకుండా అదుపు చేశారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేయడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. గ్రామంలోని లక్ష్మయ్య అనే రైతుకు చెందిన రెండు ఎకరాల సుబాబుల్ తోట మంటల్లో కాలిపోయింది. శేషారావు అనే రైతుకు రూ.2 లక్షల మేర నష్టం జరిగింది. ఓరుగంటి అంజిరెడ్డికి చెందిన చెందిన ఎకరా మునగ చేను, వాసుపల్లి సుబ్బారెడ్డికి చెందిన ఎకరా బుడిద గుమ్మడి కాయల చేను పూర్తిగా దగ్ధమైంది. సంపంగుల విజయరాజుకు చెందిన మామిడి తోట కొత మేర దగ్ధమైంది. సమాచారం అందుకున్న తహసీల్దార్ సింగారావు కొండమూరు ఎస్సీ కాలనీని పరిశీలించారు. నష్టం వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తానని తెలిపారు.
మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పంటించిన రైతులు
పక్క పొలాలకు అంటుకున్న మంటలు
20 నుంచి 25 వరకు బోర్లు దగ్ధం
రెండు ఎకరాల సుబాబుల్ తోట కూడా..


