త్రిపురాంతకం: మండలంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను గురువారం జిల్లా అధికారులు తనిఖీ చేశారు. ఎరువులు, పురుగుమందుల నిల్వలపై కేసులు నమోదు చేశారు. ఎరువుల ధరల పెరుగుదలపై ‘ఎరువులు బె‘ధర’గొడుతున్నాయ్’ అనే శీర్షికతో సాక్షి దినపత్రిక జిల్లా పేజీలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. త్రిపురాంతకంలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలపై జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, వ్యవసాయశాఖ జేడీఏ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. వెంకట ధరణి ట్రేడర్స్లో 3.49 లక్షల రూపాయల స్టాక్, కదంబని ట్రేడర్స్లో 34 వేల రూపాయల ఖరీదు చేసే ఎరువులు సీజ్ చేశారు. స్టాక్ బుక్ నిల్వల్లో వ్యత్యాసం ఉండటంతో వాటి అమ్మకాలు నిలుపుదల చేశారు. ఆయా దుకాణదారులపై 6ఏ కేసులు నమోదు చేశారు. తహసీల్దార్ విజయభాస్కర్, ఏఓలు సంఘమేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్ఓ రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


