● కలెక్టర్ ఎం విజయసునీత
మార్కాపురం టౌన్: నిరుద్యోగ యువతకు అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించాలని కలెక్టర్ ఎం విజయసునీత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఛాంబర్లో బుధవారం జిల్లాలోని నైపుణ్య అభివృద్ధి అధికారులతో పాటు సంబంధితశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి నిరుద్యోగులకు ఉపాధి మార్గం చూపాలని కోరారు. వారి పరిధిలో ఉన్న నిరుద్యోగులకు జాబ్మేళాల వివరాలు తెలియజేయాలన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ పంపుసెట్లు, వ్యవసాయం, డ్రోన్ పైలెట్స్, ప్రకృతి వ్యవసాయం, నిర్మాణ రంగం వాటిలో యువతకు శిక్షణ ఇప్పించాలని ఆమె తెలిపారు. జిల్లా నైపుణ్యా అభివృద్ధి కమిటీలో ఉన్న వివిధ శాఖలకు చెందిన 19 మంది సభ్యులు సమన్వయంతో నిరుద్యోగులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కంచి బాబు, సిడాప్ జీడీఎం శ్రీనివాసులు, మైనింగ్ అధికారి శివప్రసాదు తదితరులు పాల్గొన్నారు.


