● టీచర్స్ గిల్డ్ వినతి
ఒంగోలు సిటీ: ఎయిడెడ్ ఉపాధ్యాయుల డీఏ, సరెండర్ లీవ్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.వెంకటరావు, సీహెచ్.ప్రభాకరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు, పదవీ విరమణ పొందిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు 2018, 2019 కి సంబంధించి 41 నెలల డీఏ బకాయిలు, 2023 నుంచి సరెండర్ లీవ్ బకాయిలు, ఆఫ్ పే లీవ్ బకాయిలు చెల్లించాలని కోరారు.
ఒంగోలు వన్టౌన్: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 26న ఒంగోలుకు చేరుకుని ప్రకాశం భవన్లోని పీజీఆర్ఎస్ హాలులో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తారని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారత అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల స్థితిగతులపై పరిశోధన నిర్వహిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల వారీగా వెనుకబడిన తరగతులకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించేందుకు సమగ్ర అనుభవ ఆధారిత అంచనాలను చేపడుతుందన్నారు. వినతి పత్రాలను అందించే వారు పైన పేర్కొన్న విషయాలను మాత్రమే పరిమితం చేయాలన్నారు.
ఒంగోలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఆర్ఐఓ ఆంజనేయులు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో 28 సెంటర్లు, మార్కాపురం జిల్లాలో 22 సెంటర్లు చొప్పున మొత్తం 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 8,249 మంది, మార్కాపురం లో 5,231 మంది చొప్పున మొత్తం 13,480 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు. అలాగే రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 4,380 మంది, మార్కాపురం జిల్లాలో 3,332 చొప్పున మొత్తం 7,712 మంది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 413 మంది, మార్కాపురం జిల్లాలో 479 మంది చొప్పున మొత్తం 892 మంది పరీక్షలకు హాజరగుతున్నట్లు చెప్పారు. అలాగే రెండో సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు ప్రకాశం జిల్లాలో 326 మంది, మార్కాపురం జిల్లాలో 460 మంది చొప్పున మొత్తం 786 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
కంభం: కోడి కూయకముందు నుంచి అర్ధరాత్రి వరకూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తుండటంతో మందుబాబులు పూటుగా మద్యం తాగి హైవే రోడ్ల వెంబడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, సందుల్లో దొర్లుతూ దర్శనమిస్తున్నారు. కంభంలో హైవే రోడ్డు పక్కన ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఓ యువకుడు తాగి పడిపోయాడు. చంద్రబాబు ప్రభుత్వంలో బడి, గుడి అన్న తేడా లేకుండా మద్యం అమ్మి కుటుంబాలను నాశనం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒంగోలు వన్టౌన్: ఒంగోలు ఉప కార్మిక కమిషనర్గా ఎస్కే గౌస్ను నియమిస్తూ కార్మిక శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ ఎ.గాయిత్రీ దేవి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


