కొనకనమిట్ల: మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన జాతీయ రహదారిపై కొనకనమిట్ల మండలం చౌటపల్లి సమీపంలో ఆదివారం జరిగింది. కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు పంచాయతీ చౌటపల్లి ఎస్సీకాలనీకి చెందిన చిరుగూరి వెంగయ్య (55) తన మోటార్ సైకిల్పై కొనకనమిట్ల వెళ్లి సరుకులు తీసుకుని తిరిగి చౌటపల్లి ఎస్సీకాలనీకి వస్తున్నాడు. అదే సమయంలో పొదిలి వైపు నుంచి మార్కాపురం వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి మోటార్ సైకిల్పై వెళ్తున్న వెంగయ్యను వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఎగిరి రోడ్డుపై పడిన వెంగయ్య తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు సంఘటన స్థలానికి కొద్ది దూరం వెళ్లి ఆగింది. మృతుడు వెంగయ్యకు భార్య కుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కూలి పని చేసుకుని జీవించే వెంగయ్య మృతి చెందడంతో భార్య, పిల్లలు, బంధువులు రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న కొనకనమిట్ల ఎస్ఐ శ్రీకాంత్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలడిగి తెలుసుకున్నారు. వెంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


