మార్కాపురం టౌన్: శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామివారి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం చెన్నకేశవ స్వామివారు మురళీకృష్ణ అలంకారంలో పొన్న వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపతి అప్పనాచార్యులు బృందం స్వామివారికి పుష్పాలంకరణ, అర్చన, నివేదన, మంగళహారతి ఇచ్చిన అనంతరం స్వామి వారిని నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ప్రధాన వీధులు కిటకిటలాడాయి. స్వామివారి పల్లకి సేవలో మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి అన్నా రాంబాబు సతీమణి దుర్గకుమారి, ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామివారిని పలువురు ప్రముఖులు, అధికారులు దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా కోలాటం, డప్పు వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.


