అద్దంకి రూరల్: పొలంలో పనులు చేసుకుంటూ జగనన్న పాటలు పెట్టుకున్నారన్న అక్కసుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన అద్దంకి మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలవకూరు గ్రామానికి చెందిన రైతు, వైఎస్సార్ సీపీ కార్యకర్త లక్కిరెడ్డి వెంకటరెడ్డి, అతని భార్య మల్లేశ్వరిలు పొలంలో కూలీలతో పాటు పసుపు కొమ్ములు కోసుకునే పని చేస్తున్నారు. సమీపంలో నిలిపి ఉన్న ట్రాక్టర్లో కూర్చొన చిన్న పిల్లాడిని కూలీలంతా జగనన్న పాటలు పెట్టమని చెప్పడంతో పాటలు పెట్టాడు. కూలీలంతా పాటలు వింటూ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో బైకుపై ఇద్దరు టీడీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని పాటలు ఆపమని ఆ కుర్రాడిని కొట్టేందుకు ప్రయత్నించారు. అది చూసిన వెంకటరెడ్డి పాటలు పెట్టుకుంటే మీకేంటి బాధ అనడంతో చేతిలో ఉన్న బటన్ నైఫ్తో వెంకటరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ముఖానికి గాయమవడంతో అతని భార్య, వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షురాలైన మల్లేశ్వరి అక్కడకు వచ్చి ప్రశ్నించింది. టీడీపీ కార్యకర్తల్లో ఒకరు ప్యాంట్ విప్పి అసభ్యంగా మాట్లాడుతూ ఏం పీక్కుంటారో పీక్కోండి.. ప్రభుత్వం మాది..మీకు దిక్కున్నచోట చెప్పుకొండి..అని బైకుపై పరారయ్యారు. గాయాలపాలైన వెంకటరెడ్డిని స్థానికులు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు.


