సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు గడిచిన రెండేళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్నారని, పాలనలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి విమర్శించారు. జగనన్న వెంటే జనం ఉన్నారని, 2029లో మళ్లీ సీఎంగా చేసుకుందామన్నారు. సోమవారం రాత్రి సంతనూతలపాడు మండలం గుమ్మళంపాడు సమీపంలోని నిధిలో ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ తరఫున ఏర్పాటు చేసిన రెండు విద్యుత్ ప్రభలపై మాజీ మంత్రి, సంతనూతపాడు నియోజకవర్గ ఇన్చార్జి మేరుగు నాగార్జునతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లాలోని కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధిష్టానంతోపాటు బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, రాజకీయాలు చూడకుండా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పఽథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని కొనియాడారు. కూటమి పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించకుండా నిలువునా ముంచారని మండిపడ్డారు. ప్రభలపై సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దుంపా చెంచురెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ఎంపీపీ విజయ నాగేశ్వరావు, స్థానిక నాయకులు ములకలపల్లి సుబ్బారావు దొడ్డపాటి శ్రీనివాసరావు ఆంజనేయులు, పెద బ్రహ్మయ్య, మంగపాటి శ్రీను, ఇనగంటి పిచ్చిరెడ్డి, పాలడుగు రాజీవ్, వాకా కోటిరెడ్డి, కందుల డానియేల్, వేమా శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.
2029లో జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందాం
చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించారు
గుమ్మళంపాడు తిరునాళ్లలో ఎమ్మెల్యే బూచేపల్లి, మాజీ మంత్రి మేరుగు


